: శిల్పా బ్రదర్స్ పారిపోయారు.. వారిని వదిలిపెట్టను!: అఖిలప్రియ సెటైర్లు

నంద్యాలలో టీడీపీ ఘన విజయం సాధించిన తర్వాత శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డిలు పారిపోయారని మంత్రి అఖిలప్రియ అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పిన శిల్పా మోహన్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని... ప్రజల ముందుకు వచ్చి, రాజకీయ సన్యాసం చేస్తున్నానని చెప్పేంత వరకు వారిని వదిలి పెట్టనని హెచ్చరించారు. గతంలో భూమా నాగిరెడ్డి గెలిచినప్పుడు కూడా శిల్పా బ్రదర్స్ ఇలాగే పారిపోయారని... ఇప్పుడు బ్రహ్మానందరెడ్డి గెలిచిన తర్వాత కూడా పలాయనం చిత్తగించారని ఎద్దేవా చేశారు.

శిల్పా కుటుంబానికి చెందిన శిల్పా సహకార్, శిల్పా బ్యాంక్ లు ప్రజలను మభ్యపెట్టేందుకేనని అన్నారు. టీడీపీ గెలుపు నేపథ్యంలో ఈ రోజు నంద్యాల టౌన్ హాల్లో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అఖిలప్రియ, బ్రహ్మానందరెడ్డిలతో పాటు మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అఖిలప్రియ మాట్లాడుతూ, నంద్యాలలో గెలిస్తే మగాళ్లం, లేకపోతే ఆడవాళ్లమంటూ చెప్పారని... ఇప్పుడు ఆయన ఎక్కడికి పారిపోయారని ప్రశ్నించారు.

More Telugu News