: దోమ‌ను చంపి, ఫొటో ట్వీట్‌ చేసినందుకు వినియోగ‌దారుని అకౌంట్‌ను బ్లాక్ చేసిన ట్విట్ట‌ర్

జ‌పాన్‌కు చెందిన ఓ వ్య‌క్తి తాను టీవీ చూస్తుండ‌గా కుట్టి ఇబ్బంది పెట్టిన దోమ‌ను చంపి, దాన్ని ఫొటో తీసి ట్విట్ట‌ర్‌లో పెట్టాడు. `నేను టీవీ చూస్తుంటే ఇబ్బంది పెడ‌తావా? చ‌చ్చిపో!` అంటూ చనిపోయిన దోమ ఫొటోతో క‌లిపి ట్వీట్ చేశాడు. త‌ర్వాత అత‌నికి అకౌంట్‌ను బ్లాక్ చేస్తున్నామ‌ని, మ‌ళ్లీ రీయాక్టివేట్ చేసుకోవ‌డం కుద‌ర‌ద‌ని చెబుతూ ట్విట్ట‌ర్ నుంచి మెయిల్ వ‌చ్చింది. అప్ప‌టి నుంచి అత‌ని ట్విట్ట‌ర్ అకౌంట్ ప‌నిచేయ‌క పోవ‌డంతో ఆ వ్య‌క్తి మ‌రో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు.

దాని ద్వారా `దోమ‌ను చంపినందుకు నా పాత అకౌంట్‌ను బ్లాక్ చేస్తారా? దోమ‌ను చంప‌డం కూడా త‌ప్పేనా?` అంటూ ట్విట్ట‌ర్‌కు మెసేజ్ చేస్తూ ట్వీట్ చేశాడు. అత‌ను కోపంగా చేసిన ఈ ట్వీట్‌ను జ‌పాన్ నెటిజ‌న్లు విప‌రీతంగా రీట్వీట్లు, షేర్లు చేశారు. దీనిపై ట్విట్ట‌ర్ నుంచి ఎలాంటి సమాధానం లేదు. కాక‌పోతే ఇటీవ‌ల ట్విట్ట‌ర్ రూపొందించిన అల్గారిథ‌మ్ ప్ర‌కారం చావు, అత్యాచారం, పేలుళ్లు వంటి ప‌దాలు ఉన్న ట్వీట్లు చేసిన వారిని అసాంఘిక కార్య‌క‌లాపాలు చేసే వారిగా భావించి, వారి అకౌంట్ల‌ను ఆటోమేటిక్‌గా బ్లాక్ చేసే స‌దుపాయం ఉన్న‌ట్లు, ఆ కార‌ణంగానే అత‌ని అకౌంట్ బ్లాక్ అయ్యుండొచ్చ‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

More Telugu News