: ముంబై వరదల ఎఫెక్ట్: ఫ్రెంచ్ కుటుంబానికి ఆశ్రయం కల్పించిన గురుద్వార.. థ్యాంక్యూ ఇండియా అంటూ లేఖ.. పారిస్‌కు ఆహ్వానం!

ముంబై వరదల్లో చిక్కుకుపోయిన ఓ ఫ్రెంచ్ కుటుంబానికి ముంబై, దాదర్‌లోని ఓ గురుద్వారా ఆశ్రయం కల్పించింది. హోటళ్లు మునిగిపోయి, ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితిలో గురుద్వారా తమకు లైట్‌హౌస్‌లా కనిపించిందని, తమను ఆదుకుందంటూ ఆ కుటుంబం గురుద్వారాకు లేఖ రాసింది. వారు తమకు ఇచ్చింది ఆశ్రయం మాత్రమే కాదని, గొప్ప అనుభూతిని కూడా అంటూ ఆ కుటుంబం కొనియాడింది. ‘థ్యాంక్యూ ఇండియా’ అంటూ కృతజ్ఞతలు తెలిపింది.

ఫ్రెంచ్ కుటుంబానికి చెందిన ఆరీ, సోఫీ బోలెస్వస్కి వారి ముగ్గురు కుమార్తెలు ముంబై వరదల్లో చిక్కుకుపోయారు. తలదాచుకునేందుకు మూడు హోటళ్లకు వెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు గురుద్వారాకు చేరుకున్నారు. అక్కడ వారికి అపూర్వ స్వాగతం లభించింది. ఆ కుటుంబానికి భోజనం పెట్టిన నిర్వాహకులు వారి కోసం ప్రత్యేకంగా ఓ గదిని కేటాయించారు. వరదలు నెమ్మదించిన తర్వాత బాధిత కుటుంబసభ్యులు పారిస్ చేరుకున్నారు. అనంతరం గురుద్వారాకు లేఖ రాశారు. బుధవారం ఉదయం లేఖ అందింది. అందులో గురుద్వారా నిర్వహకులకు ఆరీ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు ఎప్పుడైనా పారిస్ వస్తే తప్పకుండా తమ ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించారు.

More Telugu News