: బ్యాటింగ్‌కు దిగి మైదానంలో నిద్రపోయిన ధోనీ!

అవును! బ్యాటింగ్‌కు దిగిన ధోనీ మైదానంలో నిద్రపోయాడు. కాసేపు హాయిగా నిద్రపోయి సేద దీరాడు. మైదానంలో నిద్రపోవడం ఏంటి? అన్న సందేహం వస్తే తొలుత ఈ విషయం గురించి తెలుసుకోవాలి. శ్రీలంక నిర్దేశించిన 218 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 44 ఓవర్లలో 210 పరుగులు చేసింది. అప్పటికి రోహిత్ శర్మ (122), ధోనీ (61) క్రీజులో ఉన్నారు. శ్రీలంక ఓటమి ఖరారు కావడంతో తట్టుకోలేని లంక అభిమానులు స్టేడియంలోకి బాటిళ్లు విసిరారు.

 పెద్దగా అరుస్తూ బాటిళ్లు, ఇతర వస్తువులను మైదానంలోకి విసురుతూ ఆటకు అంతరాయం కలిగించారు. గ్రౌండ్‌లోని బాటిళ్లను సిబ్బంది తొలగించిన తర్వాత కూడా మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న విషయంలో స్పష్టత రాలేదు. అంపైర్లు ఆటను తాత్కాలికంగా నిలిపివేయడంతో ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయారు. అయితే ధోనీ మాత్రం మైదానంలో హాయిగా నిద్రపోయాడు. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత విజయానికి అవసరమైన 8 పరుగులు చేసి భారత్‌కు విజయాన్ని అందించారు.

More Telugu News