: ‘ఆంధ్రజ్యోతి’పై నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఆగ్రహం.. పరువునష్టం దావా వేస్తానని హెచ్చరిక

ఆంధ్రజ్యోతి దినపత్రిక తీరు తనను తీవ్ర వేదనకు గురిచేస్తోందని, ఆ పత్రిక రాస్తున్న వార్తలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని నెల్లూరు నగర ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. గత పది రోజులుగా తనపై తప్పుడు వార్తలు రాస్తోందని ఆరోపిస్తూ గురువారం ఆయన ఆంధ్రోజ్యోతి ప్రాంతీయ  కార్యాలయం ఎదుట ధర్నా చేసేందుకు నిర్ణయించారు. దీంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా  అనిల్ మాట్లాడుతూ.. క్రికెట్ బెట్టింగ్‌ విషయంలో కొన్ని వివరాల కోసం పోలీసులు తనకు నోటీసులు ఇచ్చారని, అయితే దీనికి లేనిపోని ఆరోపణలు జతచేస్తూ తనపై అసత్య కథనాలు ప్రచురించిందని పేర్కొన్నారు. బుకీ శంషేర్ తన అనుచరుడని కథనంలో పేర్కొన్నారని, అతడు ఎవరి అనుచరుడో ప్రజలకు తెలుసని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కావాలనే తనపై తప్పుడు కథనాలు రాయిస్తున్నారని ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా నిజాయతీ నిరూపించుకున్నానని స్పష్టం చేశారు. తనపై అసత్య ఆరోపణలతో కథనం ప్రచురించిన ‘ఆంధ్రజ్యోతి’పై పరువునష్టం దావా వేయనున్నట్టు అనిల్ తెలిపారు.

More Telugu News