: లక్షల్లో లైకులతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్వాతంత్ర్య దినోత్సవ ఫోటో ఇదే!

సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతోంది. అసోంను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. నడుంలోతు నీళ్లలో ఉన్న ఓ పాఠశాలలో జరిగిన పంద్రాగస్టు వేడుకలకు సంబంధించిన ఫొటో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. లక్షల్లో నెటిజన్లు ఆ ఫొటోను లైక్‌ కొట్టి షేర్‌ చేస్తూ ప్రశంసిస్తున్నారు. దాని వివరాల్లోకివెళ్తే...అసోంలోని ధుబ్రి ప్రాంతంలోని నష్కర ప్రాథమిక పాఠశాలలో జెండా ఎగురవేశారు. జెండా వందన కార్యక్రమానికి ఓ ఉపాధ్యాయుడు, ముగ్గురు విద్యార్థులు హాజరయ్యారు.

వారిలో ఇద్దరు చిన్నారుల భుజాల వరకు వరద నీరు ఉన్నప్పటికీ వాళ్లు మాత్రం జెండా వందనం చేస్తూ నిలబడ్డారు. దీని గురించి ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు మిజనూర్‌ రెహమాన్‌ వివరిస్తూ, సంబంధిత ఫొటోను ఫేస్‌ బుక్‌ లో పోస్టు చేశారు. ‘ప్రస్తుతం మేము ఎలా ఉన్నామనేది చెప్పలేము.. ఈ ఫొటోనే చెబుతుంది’ అని ఆయన రాసుకొచ్చారు. ఆ రాష్ట్ర నిబంధనల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో జరిగే ప్రతీ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను, ఫొటోలతో సహా తీసి విద్యాశాఖకు పంపించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తీసిన ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి, జిల్లా విద్యాధికారికి పంపారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లక్షల్లో లైకులు, షేర్లు, కామెంట్లతో దూసుకుపోతోంది. 

More Telugu News