: హిందూ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న 'లవ్ జీహాదీ'పై ఎన్ఐఏ విచారణకు సుప్రీం ఆదేశం

'లవ్ జీహాద్' పేరిట హిందూ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుని, ఆపై మతం మార్చిన వ్యవహారంపై ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ)తో విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. అఖిల అనే కేరళకు చెందిన హోమియోపతి విద్యార్థిని ముస్లిం యువకుడిని వివాహం చేసుకుని హాదియాగా పేరు మార్చుకుని, మతం మారిన ఘటనపై బుధవారం నాడు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ జగదీశ్ సింగ్ కేహార్, జస్టిస్ డీవీ చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్, లవ్ జీహాద్ పై విచారించి నివేదిక ఇవ్వాలని ఎన్ఐఏను ఆదేశించింది.

ఈ వివాహం గత సంవత్సరం జరుగగా, తమ కుమార్తెను మోసం చేశారని అఖిల తల్లిదండ్రులు కేరళ హైకోర్టును ఆశ్రయించగా, వివాహాన్ని రద్దు చేస్తున్నట్టు తీర్పు వెలువడిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె భర్త షాఫిన్ జహాన్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, విచారణ తరువాత నిజానిజాలను వెలికితీసే బాధ్యతను ఎన్ఐఏకు అప్పగించింది. ఇది చాలా తీవ్రమైన సమస్యని, సున్నితమైనదని ధర్మాసనం అభిప్రాయపడింది. కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, స్వతంత్ర్య భారతావనిలో ఓ మహిళ హక్కును హరించేదేనని జహాన్ చాలెంజ్ చేయగా, తన బిడ్డను ట్రాప్ చేసి, ఆమె మనసు మార్చారని, బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారని అఖిల తండ్రి తరఫున న్యాయవాది మాధవి వాదనలు వినిపించారు.

More Telugu News