: 17 మంది ఎమ్మెల్యేలతో దినకరన్ క్యాంపు ఏర్పాటు.. మరో 20 మందిని తనవైపునకు లాక్కునే యత్నం!

తమిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మృతి త‌రువాత ఆ రాష్ట్ర సీఎం కుర్చీలో కూర్చునేందుకు ఆమె స‌న్నిహితురాలు శశికళ ఎన్నో ప్ర‌యత్నాలు చేసి విఫ‌ల‌మైన విష‌యం తెలిసిందే. త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌ను రిసార్టుల్లో కూడా ఉంచి క్యాంపు రాజ‌కీయాలు కూడా ఆమె చేశారు. ఇప్పుడు ఆమె బంధువు టీటీవీ దినకరన్ కూడా ఆమెను అనుస‌రిస్తున్నారు. అన్నాడీఎంకే పార్టీ నుంచి త‌న‌ను బ‌హిష్క‌రించ‌డంతో సీఎం ప‌ళ‌నిస్వామిపై ఆగ్ర‌హంతో ఉన్న దిన‌క‌ర‌న్‌.. త‌న‌ అత్త శశికళ‌ లాగే క్యాంపు రాజకీయాలు చేయాల‌ని యోచిస్తున్నారు.
 
ఇప్పటికే 17 మంది ఎమ్మెల్యేలతో క్యాంపు ఏర్పాటు చేసుకున్న ఆయ‌న‌... మ‌రో 20 మంది ఎమ్మెల్యేలను తనవైపు లాక్కునేందుకు య‌త్నిస్తున్నారు. ఇదే సమయంలో తమిళనాడు ఇంఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావును పళని స్వామి-పన్నీర్ వర్గాలు క‌ల‌వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు దినకరన్ కూడా గ‌వ‌ర్న‌ర్ ను క‌లవాల‌నుకుంటున్నారు. దీంతో త‌మిళ‌నాడు రాజ‌కీయాలు మ‌రోసారి వేడెక్కుతున్నాయి.      

More Telugu News