: 249 మందితో వెళ్తున్న సమయంలో విమానం అద్దం పగిలింది.. ఎమర్జన్సీ ల్యాండింగ్!

249 మందితో వెళ్తున్న ఎయిరిండియా విమానం గాల్లో ఉండగా పైలట్ ముందున్న అద్దం అకస్మాత్తుగా పగలడం ప్రారంభించడంతో విమానాన్ని దారి మళ్లించిన ఘటన జర్మనీలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే...జర్మనీలోని ఫ్రాంక్‌ ఫర్ట్‌ నుంచి ఢిల్లీ వెళుతున్న ఎయిరిండియా విమానం 249 మంది ప్రయాణికులతో బయల్దేరింది. విమానం గాల్లోకి లేచి గమ్యం దిశగా సాగిపోతున్న సమయంలో విమానంలోని పైలట్ ముందు అద్దం పగలడం ప్రారంభించింది. అద్దంపై పగుళ్లు గుర్తించిన పైలట్ ఏటీసీని సంప్రదించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు అనుమతి కోరారు.

వెంటనే అధికారులు స్పందించడంతో టెహ్రాన్ లో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. అయితే అద్దం పూర్తిగా పగలకపోవడంతో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. విమానం అద్దం మార్చేందుకు సిబ్బంది నిమగ్నమవగా, అంతవరకు ప్రయాణికులందరికీ ఎయిరిండియా బస ఏర్పాటు చేసింది. విమానం ప్రయాణిస్తున్న సమయంలో అద్దానికి ఏదైనా వస్తువు తగలడం, లేదా ఉష్ణోగ్రత పెరగడం కారణంగా అద్దాలు పగిలే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

More Telugu News