: ప్రత్యేకహోదాపై నా పోరాటం ఆగలేదు... ఇతర పార్టీలు ఆ అంశాన్ని నిర్వీర్యం చేశాయి: పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా అంశాన్ని కావాలనే నిర్వీర్యం చేశారని ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. విజయవాడలో సీఎం చంద్రబాబుతో భేటీ ముగిసిన అనంతరం నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేకహోదాపై తన పోరాటం ముగియలేదని అన్నారు. ఆ అంశాన్ని పార్టీలన్నీ కావాలని నిర్వీర్యం చేసినా, తాను మాత్రం వదల్లేదని చెప్పారు. దానిపై ప్రణాళికాబద్ధమైన పోరాటం జరుగుతుందని ఆయన చెప్పారు. త్వరలోనే పోరాట ప్రణాళిక ప్రకటిస్తానని ఆయన చెప్పారు.

ప్రత్యేకహోదా వస్తుందా? రాదా? అన్నది పక్కన పెడితే పోరాటం జరిగిందా? లేదా? అన్నది చాలా ముఖ్యమని అన్నారు. ఏపీని అన్యాయంగా విభజించినప్పుడు ప్రత్యేకహోదా ఇవ్వాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు. దానిపై పోరాటం చేస్తానని ఆయన చెప్పారు. అలాగే పశువు కోసం మనిషిని చంపడం సరైన విధానం కాదని ఆయన స్పష్టం చేశారు. తప్పును తప్పు అని ఖండించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వాలు తప్పు చేస్తే ఎదిరించేందుకు తాను సిద్ధమని ఆయన అన్నారు. రెండు రోజుల్లో నంద్యాల ఉప ఎన్నికలపై స్పందిస్తానని ఆయన అన్నారు. 

More Telugu News