: ఇప్పుడు మేమిద్దరం ఫ్రెండ్స్ కానీ... అప్పట్లో అతనిని ఎలా గాయపరచాలా? అని చూసేవాడిని: షోయబ్ అక్తర్

క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం కామెంటేటర్ గా స్థిరపడిన షోయబ్ అక్తర్ తన కెరీర్ సందర్భంగా చోటుచేసుకున్న సన్నివేశాలను అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంటాడు. ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. 160 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతూ ప్రత్యర్థి బ్యాట్స్ మన్ ను గాయపర్చడం ఇష్టం ఉండేది కాదని అన్నాడు. అయితే దురదృష్టవశాత్తూ తన బౌలింగ్ లో 16 మంది క్రికెటర్లు గాయపడి పెవిలియన్ చేరిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నాడు.

ఎవరినీ గాయపరిచేందుకు ఇష్టపడని తాను ఆసీస్ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ను మాత్రం గాయపర్చాలని ప్రయత్నించేవాడినని చెప్పాడు. టోర్నీలో అయినా, ప్రాక్టీస్ మ్యాచ్ లో అయినా సరే ఆసీస్ తో ఆడితే తన లక్ష్యం అతనిని గాయపర్చడమేనని చెప్పాడు. చాలా సార్లు విజయం సాధించానని చెప్పాడు. అప్పట్లో అలా చేసినా, ఇప్పుడు తామిద్దరం మంచి స్నేహితులమని ఈ రావల్పిండి ఎక్స్ ప్రెస్ తెలిపాడు. 

More Telugu News