: ఇన్ఫోసిస్ బోర్డుతో యుద్ధాన్ని ఆపేస్తున్నా: నారాయణమూర్తి

ఇన్ఫోసిస్ బోర్డు డైరెక్టర్లకు వ్యతిరేకంగా మొదలు పెట్టిన యుద్ధాన్ని నిలిపివేస్తున్నట్టు సంస్థ సహ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ నారాయణమూర్తి వ్యాఖ్యానించారు. ఇన్ఫోసిస్ నిర్వహణపై లేవనెత్తిన ప్రశ్నలకు సంస్థే స్వయంగా సమాధానాలు ఇస్తుందని ఆయన అన్నారు. ఇన్ఫీని తలెత్తుకు నిలిచేలా చేసిన నారాయణమూర్తి, ఇతర సహ వ్యవస్థాపకులతో కలసి ప్రస్తుత మేనేజ్ మెంట్ వివాదాస్పద నిర్ణయాలపై పలు ప్రశ్నలు లేవనెత్తిన సంగతి తెలిసిందే.

 కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విశాల్ సిక్కా వేతనం పెంపు, ఇతర ఉన్నతోద్యోగులకు భారీ ప్యాకేజీలు ఇవ్వడంపై మూర్తి సహా నందన్ నిలేకని, క్రిస్ గోపాలకృష్ణన్ తదితరులు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంలో మరింతగా లాగితే, సంస్థకున్న మంచి పేరు దెబ్బతింటుందన్న ఉద్దేశంతోనే విమర్శల యుద్ధాన్ని ఆపాలని మూర్తి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇక వ్యవస్థాపకులే ఇలా ప్రశ్నించడంతో మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ సైతం నశించగా, గత సెషన్లలో ఇన్ఫీ ఈక్విటీ విలువ కూడా పతనమైన సంగతి తెలిసిందే.

More Telugu News