kalpana: నా కుటుంబ స‌భ్యుల వ‌ద్ద‌కు తిరిగివ‌చ్చిన‌ట్టుంది: ఎమ్మెల్యే ఉప్పులేటి కల్ప‌న

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి దిశ‌గా న‌డిపిస్తున్నారని, ఆయ‌న అభివృద్ధి ప‌నులు చూసే తాము టీడీపీలో చేరామ‌ని టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్ప‌న అన్నారు. ఈ రోజు విజ‌య‌వాడ‌లో టీడీపీ అధినేత‌, రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న అనంత‌రం ఆమె మాట్లాడుతూ... చంద్ర‌బాబు స‌మ‌క్షంలో ఈ రోజు త‌న‌తో పాటు జ‌డ్పీటీసీలు, స‌ర్పంచ్‌లు, ప‌లు మండ‌లాల వైసీపీ అధ్య‌క్షులు చేరిన‌ట్లు పేర్కొన్నారు. చంద్ర‌బాబు నాయుడి పాల‌న‌లోనే అభివృద్ధి చెందుతుంద‌ని తాము భావిస్తున్న‌ట్లు తెలిపారు. చంద్రబాబుపై ప్ర‌జ‌లు ఎంతో న‌మ్మ‌కం పెట్టుకున్నార‌ని, ఆయ‌న వ‌ల్లే అభివృద్ధి సాధ్య‌ప‌డుతుంద‌ని భావించి ప్ర‌జ‌లు ఆయ‌న‌ను ఎన్నుకున్నారని అన్నారు. రాజ‌ధాని నిర్మాణం, ప్రాజెక్టుల నిర్మాణంలో చంద్ర‌బాబు చూపిస్తోన్న కృషి అభినంద‌నీయమ‌ని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆయన ఎంతగానో కృషి చేస్తున్నారని ఆమె అన్నారు. ఎన్నో ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టిన ఆయ‌న ప‌నితీరుకి తాము ఆక‌ర్షితుల‌మయ్యామ‌ని చెప్పారు. గతంలో తాను టీడీపీలో కొన్ని సంవ‌త్స‌రాలు ఉన్నానని గుర్తుచేసుకున్నారు.

కొన్ని కార‌ణాల వ‌ల్ల వైసీపీ నుంచి పోటీ చేశాన‌ని చెప్పారు. ఇప్పుడు త‌న‌కు త‌న‌ కుటుంబ స‌భ్యుల వ‌ద్ద‌కు తిరిగివ‌చ్చిన‌ట్టుందని అన్నారు. చంద్ర‌బాబు పార్టీలో ఏ బాధ్య‌త‌లు అప్ప‌జెప్పినా చేయ‌డానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. త‌న‌ నియోజ‌క వ‌ర్గ అభివృద్ధికి పాటుప‌డుతానని అన్నారు. రెండేళ్లుగా త‌న నియోజ‌క‌వర్గానికి ఏమీ చేయ‌లేక‌పోయాన‌నే బాధ వుందని అన్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప‌డుతున్న శ్ర‌మ‌కు తామంతా ఆక‌ర్షితుల‌మై వ‌చ్చామని అన్నారు. చంద్ర‌బాబు ఆశ‌య సాధనకు తాము కూడా పాటుప‌డుతూ రాష్ట్రాభివృద్ధిలో పాలు పంచుకుంటామ‌ని చెప్పారు. ప‌ట్టిసీమతో చంద్రబాబు ఎన్నో వేల ఎక‌రాల‌కు నీరును  అందిస్తున్నార‌ని అన్నారు.

More Telugu News