jana reddy: అసెంబ్లీలో నవ్వులు పూయించిన జానారెడ్డి

తెలంగాణ శాస‌న‌స‌భ‌లో ఈ రోజు పెద్ద‌నోట్ల ర‌ద్దుపై చ‌ర్చ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద‌నోట్ల ర‌ద్దుపై ప్ర‌క‌ట‌న చేసిన త‌రువాత కాంగ్రెస్‌ నేత జానారెడ్డి మాట్లాడుతూ స‌భ‌లో న‌వ్వులు పూయించారు. న‌ల్ల‌ధ‌నం నిరోధానికి కేంద్ర‌ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం తగ్గలేదని సీఎం అంటున్నార‌ని.. జానారెడ్డి ఇంకా ఎదో చెప్పబోయారు. ఇంత‌లో జోక్యం చేసుకున్న‌ కేసీఆర్ కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో తెలంగాణ‌కు ఆదాయం తగ్గలేదని తాను అనలేదని అన్నారు. తాను ఈ అంశంపై సభ్యులికిచ్చిన లిఖితపూర్వక పత్రాల్లోనూ ఆ విధంగా చెప్ప‌లేద‌ని అన్నారు. ఇంతలో జానారెడ్డి మ‌ళ్లీ కల్పించుకుని సీఎం అచ్చం అలాగే అనకపోయినా ఆయన మాటల సారాంశం తనకు అలాగే అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో తాను బహిరంగంగా బాధ‌ప‌డుతోంటే. కేసీఆర్ మాత్రం అంతర్గతంగా బాధపడుతున్నారని ఆయన వాఖ్యానించ‌డంతో స‌భ‌లో స‌భ్యులంద‌రూ చిరున‌వ్వులు చిందించారు.

More Telugu News