: మరింత పడిపోయిన బంగారం ధర

నల్లకుబేరులు నిల్వ చేసుకుంటున్న బంగారంపై కేంద్ర ప్ర‌భుత్వం నిబంధ‌న‌లు విధిస్తూ చ‌ట్టం తీసుకువ‌స్తోంద‌న్న వార్తల నేప‌థ్యంలో బంగారం ధ‌ర మ‌రింత ప‌డిపోయి ఆరు నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది. వారం రోజుల క్రితం 10 గ్రాముల బంగారం ధర రూ.28,435 గా న‌మోద‌యిన సంగ‌తి తెలిసిందే. రోజురోజుకీ త‌గ్గుతూ వ‌స్తూ ఈ రోజు ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.28,141గా నమోదైంది. మ‌రోవైపు అంతర్జాతీయంగా కూడా బంగారానికి డిమాండ్ త‌గ్గ‌డంతో ధరలు సుమారు రూ.300 రూపాయల మేర పతనమయ్యాయి. ఇక మార్కెట్లో వెండి ధ‌ర కూడా త‌గ్గి, కేజీ ధర రూ.40,700గా కొన‌సాగుతోంది. అమెరికా అధ్య‌క్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక‌యిన త‌రువాత ఆ దేశ‌ డాలర్ విలువ పెరుగుతుండడం మ‌రోవైపు అంతర్జాతీయంగా డాలర్ ట్రెండ్ బలహీనపడినట్టు ఆర్థిక‌ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, గ్లోబల్ గా బంగారం ధరలు 1.25 శాతం క్షీణించి ఒక్క ఔన్స్ కు 1,173 డాలర్లుగా కొన‌సాగుతోంది. భార‌త్‌లో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌తో జువెల్లరీ, రిటైలర్ల నుంచి బులియన్ మార్కెట్లో బంగారం డిమాండ్ పడిపోతోంద‌ని, వారు ఒత్తిడిని ఎదుర్కుంటున్నార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

More Telugu News