: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఐపీఓకు థమ్స్ అప్!

సుమారు రూ. 6 వేల కోట్ల నిధుల సేకరణ లక్ష్యంగా నేడు మార్కెట్ కు వచ్చిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ కు బ్రోకరేజ్ వర్గాలు మంచి రేటింగ్ ను ఇచ్చాయి. కంపెనీకి బలమైన బిజినెస్ ప్రొఫైల్ ఉందని తేల్చి చెప్పాయి. ఇండియాలోని బీమా కంపెనీల్లో ఐపీఓకు వచ్చిన తొలి సంస్థగా, 2010లో కోల్‌ ఇండియా ఐపీఓ తర్వాత వచ్చిన అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూగా మార్కెట్ ను తాకిన ఐసీఐసీఐ ప్రూ వాటాల కోసం చిన్న ఇన్వెస్టర్లు పోటీ పడ్డారు. ఈ ఉదయం ఇష్యూ ప్రారంభమైన పది నిమిషాల వ్యవధిలోనే 4 లక్షలకు పైగా ఈక్విటీలకు బిడ్లు వచ్చాయి. మొత్తం 13.23 కోట్ల వాటాలను రూ. 300 నుంచి రూ. 334 ప్రైస్ బ్యాండ్ పై సంస్థ ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 4.9 కోట్ల వాటాలను యాంకర్ ఇన్వెస్టర్లకు ఇవ్వడం ద్వారా రూ. 1,635 కోట్లను సంస్థ సేకరించింది. ఐపీఓ ఎన్నో రెట్లు అధిక సబ్ స్క్రయిబ్ అవుతుందని బ్రోకరేజ్ సంస్థలు ఆనంద్ రాఠీ, అజ్ కాన్ గ్లోబల్, ఏంజల్ బ్రోకింగ్, హేమ్ సెక్యూరిటీస్ వంటి సంస్థలు అంచనా వేస్తున్నాయి. హయ్యర్ ప్రైస్ బ్యాండ్ రూ. 334పై లెక్కిస్తే, సంస్థ విలువ రూ. 48 వేల కోట్లుగా వుంటుంది. రెండేళ్ల క్రితం సంస్థలో 6 శాతం వాటాను విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ, టీమ్ సెక్ హోల్డింగ్స్ లకు రూ. 1,950 కోట్లకు కేటాయించిన సమయంలో, సంస్థ విలువను రూ. 32,500 కోట్లుగా లెక్కించారు. ఇప్పుడది మరో రూ. 14 వేల కోట్లు పెరిగింది.

More Telugu News