: గద్వాల‌పై కేసీఆర్ కక్షగట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు: డీకే అరుణ

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలోని గద్వాలను జిల్లాగా ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేస్తూ పోరాడుతున్న కాంగ్రెస్ మహిళా నేత, మాజీ మంత్రి డీకే అరుణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఈరోజు హైద‌రాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గ‌ద్వాల‌పై కేసీఆర్ కక్షగట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు. ఆ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాల‌ని ఒకే వ్యక్తి నుంచి వేల సంఖ్యలో విన్న‌తులు వచ్చాయంటూ చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌ని ఆమె అన్నారు. ప్ర‌భుత్వం చేస్తోన్న‌ జిల్లాల ఏర్పాటు ప్ర‌క్రియ‌ శాస్త్రీయంగా లేద‌ని డీకే అరుణ అన్నారు. గ్రామ సభల ద్వారా ప్ర‌భుత్వం ప్రజాభిప్రాయం తీసుకొని జిల్లాలు ఏర్పాటు చేయాల‌ని ఆమె డిమాండ్ చేశారు. జిల్లాల ఏర్పాటులో ప్రజల సెంటిమెంట్ ను గౌరవించాల‌ని ఆమె అన్నారు. ప్ర‌జ‌లు కోరుకుంటున్న విధంగా గద్వాల‌ను జిల్లాగా ఏర్పాటు చేయాల‌ని ఆమె సూచించారు.

More Telugu News