: తెలంగాణ ప్రజలను ముఖ్యమంత్రి పక్కదోవ పట్టిస్తున్నారు: మ‌ల్లు భట్టీవిక్ర‌మార్క

తెలంగాణ ప్రభుత్వం చేపడుతోన్న కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రతిపక్ష కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శ‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. ఈరోజు హైద‌రాబాద్‌లో టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మ‌ల్లు భట్టీవిక్ర‌మార్క మాట్లాడుతూ... ముఖ్య‌మంత్రి రాష్ట్ర‌ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం త‌మ‌ రాజకీయ స్వ‌ప్ర‌యోజ‌నాలను దృష్టిలో పెట్టుకొనే కొత్త జిల్లాల ఏర్పాటులో ముందుకు వెళుతోంద‌ని ఆయ‌న ఆరోపించారు. జిల్లాల ఏర్పాటు ప్ర‌భుత్వ‌ పాలనను ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు మ‌రింత చేర‌వేసేలా లేద‌ని భట్టీవిక్రమార్క అన్నారు. ప్ర‌భుత్వం అనుస‌రిస్తోన్న ఈ విధానాన్ని త‌మ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోద‌ని అన్నారు. తాము ఇటీవ‌ల నిర్వ‌హించిన‌ అఖిలపక్ష సమావేశంలోనూ ఇదే విష‌యాన్ని చెప్పామ‌ని భ‌ట్టీ తెలిపారు. గద్వాల, జనగామ ప్రాంతాల‌ను జిల్లాలుగా చేయాల‌ని ప్ర‌జ‌లు చేస్తోన్న పోరాటానికి తాము మ‌ద్ద‌తిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

More Telugu News