: విగ్గుతో ప్రార్థనలు చేయొద్దు.. ముస్లింలకు ఫత్వా జారీ చేసిన దియోబంద్

ముస్లింలు విగ్గుతో నమాజ్‌‌లో పాల్గొనరాదంటూ ఉత్తరప్రదేశ్‌లోని దారుల్ ఉలూమ్ దియోబంద్ సెమినరీ తాజాగా ఫత్వా జారీ చేసింది. విగ్గు, అతికించుకున్న గడ్డంతో చేసే ప్రార్థనలు పూర్తికానట్టేనని పేర్కొంది. నమాజుకు ముందు చేతులు, ముఖం, తల కడుక్కోవడం(విజు), మొత్తం శరీరాన్ని శుభ్రం చేసుకోవడం(గస్ల్) రెండూ తప్పనిసరి. విగ్గు తగిలించుకుని తల కడుక్కోవడం వల్ల నీరు నెత్తికి చేరే అవకాశం లేదని దియోబంద్ అధికార ప్రతినిధి అష్రాఫ్ ఉస్మానీ పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల ప్రార్థన పూర్తికానట్టే భావిస్తామన్నారు. విగ్గు ధరించడం ముఖ్యమనుకుంటే ప్రార్థనల సమయంలో దానిని తీసి పక్కన పెట్టాలని సూచించారు. అయితే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకున్న వారి విషయంలో ఎటువంటి ఆంక్షలు లేవన్నారు. విగ్గుల విషయంలో తమకు బోల్డన్ని లేఖలు అందిన తర్వాతే పూర్తిస్థాయిలో పరిశీలించి ఫత్వా జారీ చేసినట్టు ఉస్మానీ వివరించారు.

More Telugu News