: హైదరాబాదు వేదికగా వచ్చే ఫిబ్రవరిలో టీమిండియా, బంగ్లా మధ్య టెస్టు

హైదరాబాదు వేదికగా టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య వచ్చే ఏడాది ఫిబ్రవరి 8 నుంచి 12 వరకు టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు బీసీసీఐ బంగ్లాదేశ్ క్రికెట్ అసోసియేషన్ కు కబురంపింది. బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, టెస్టు ఆడే ప్రతి దేశానికి భారత్ తో ఆడే అవకాశం కల్పించాలని బీసీసీఐ భావిస్తోందని అన్నారు. అందులో భాగంగా గతంలో భారత్ లో నవంబరు 10, 2000లో టీమిండియాతో తలపడిన బంగ్లాదేశ్‌ కు తరువాత భారత జట్టుతో టెస్టు ఆడే అవకాశం రాలేదని అన్నారు. ఈ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 2017 ఫిబ్రవరి 8 నుంచి 12 వరకు టెస్టు మ్యాచ్‌ నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. దీనిపై బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ, పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్‌, బంగ్లాదేశ్‌ జట్లు పోటాపోటీగా తలపడుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ టెస్టు మ్యాచ్‌ కూడా అందరి అంచనాలను అందుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

More Telugu News