: జర్మనీలో రైలు ప్రయాణికులపై గొడ్డలితో దాడి.. ఆఫ్గాన్ జాతీయుడిని కాల్చివేసిన పోలీసులు

ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న దాడి జరిగినా అది ఉగ్రదాడి ఏమోనని హడలిపోతున్నారు. తాజాగా సోమవారం రాత్రి ఓ ఆఫ్గాన్ యువకుడు(17) దక్షిణ జర్మనీలో రైలు ప్రయాణికులపై గొడ్డలి, కత్తితో విరుచుకుపడ్డాడు. వారిని బెంబేలెత్తించాడు. అతడి దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా మరొకరు స్వల్ప గాయాలపాలయ్యారు. 14 మంది షాక్‌లోకి వెళ్లిపోయారు. క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. రైలులో ఆగంతకుడి దాడి గురించి సమాచారం అందుకున్న పోలీసులు పారిపోతున్న దుండగుడిని కాల్చిచంపారు. అతడిని ఆఫ్గాన్ జాతీయుడిగా గుర్తించారు. గతేడాది జర్మనీకి 1.50లక్షల మంది ఆఫ్గాన్ నుంచి వలస వచ్చారు. ఈ దుండగుడు వారిలో ఒకడా? లేక ఇక్కడే నివసిస్తున్నవాడేనా? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన వెనుక ఉన్న ఉద్దేశం అంతుచిక్కడం లేదని, దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు వివరించారు.

More Telugu News