: స్మార్ట్ ఫోన్లలో గేమ్స్ ఆడేవారిలో అధికులు మహిళలే... ఫేస్ బుక్ తాజా అధ్యయనం

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్లలో గేమ్స్ ఎక్కువగా ఆడుతున్నది ఆడవాళ్లేనని ఫేస్ బుక్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. 12 దేశాలను ఈ సర్వేలో భాగం చేయగా, స్మార్ట్ ఫోన్లు వాడుతున్న మహిళల్లో 47 శాతం మంది వివిధ రకాల ఆటలు ఆడుతున్నారని పేర్కొంది. ఫోన్లు చేసుకోవడానికన్నా, గేమింగ్ పరికరంగానే మహిళల్లో స్మార్ట్ ఫోన్లు ప్రాచుర్యం పొందాయని వెల్లడించింది. ఆసియా, ఐరోపా, అమెరికా, మధ్య ప్రాచ్య దేశాల్లో 18 సంవత్సరాల వయసుకు పైబడిన వారిని సర్వేలో భాగం చేశామని ఫేస్ బుక్ తెలిపింది. గేమింగ్ డివైజ్ గా స్మార్ట్ ఫోన్ ను 71 శాతం మంది ఎంచుకున్నారని ప్రకటించింది. మొబైల్ గేమ్స్ ఆడుతున్న వారు కనీసం నెలకోసారి ఆటలను అప్ డేట్ లేదా కొత్త గేమ్స్ కోసం డబ్బు ఖర్చు చేస్తున్నారని వివరించింది. ఇక ఎక్కువ గేమ్స్ గురించి సోషల్ మీడియా నుంచి తమకు సమాచారం వస్తోందని సర్వేలో పాల్గొన్న అత్యధికులు వెల్లడించారు. టైమ్ పాస్ కోసం గేమ్స్ ఆడుతున్నట్టు 68 శాతం మంది వెల్లడించగా, ఫోటో, వీడియో సేవల కోసం వాడుతున్నామని 57 శాతం మంది చెప్పినట్టు ఫేస్ బుక్ అధ్యయన నివేదిక తెలియజేసింది.

More Telugu News