: కొనసాగిన లాభాలు... రూ. 37 వేల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద

భారత స్టాక్ మార్కెట్ లాభాలు కొనసాగాయి. సోమవారం నాటి సెషన్లో 500 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్, నేడు మరో 180 పాయింట్లకు పైగా లాభపడగా, ఇన్వెస్టర్ల సంపద రూ. 37 వేల కోట్లు పెరిగింది. సెషన్ ఆరంభంలోనే క్రితం ముగింపుతో పోలిస్తే 120 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్, ఆపై మధ్యాహ్నం తరువాత ఒక్కసారిగా ముందుకు దుమికింది. మిడ్ క్యాప్ సెక్టారు సైతం అర శాతం పెరిగింది. మంగళవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 181.45 పాయింట్లు పెరిగి 0.66 శాతం లాభంతో 27,808.14 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 53.15 పాయింట్లు పెరిగి 0.63 శాతం లాభంతో 8,521.05 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.49 శాతం, స్మాల్ కాప్ 0.08 శాతం లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 30 కంపెనీలు లాభపడ్డాయి. టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందాల్కో, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, టాటా పవర్, బీపీసీఎల్, సిప్లా, కోల్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,932 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,243 కంపెనీలు లాభాలను, 1,519 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. సోమవారం నాడు రూ. 1,05,37,709 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్, నేడు రూ. 1,05,74,222 కోట్లకు పెరిగింది.

More Telugu News