: ‘విజిట్‌’ యాప్‌తో ఆరోగ్య సిద్ధి!

బిట్స్‌-పిలానీకి చెందిన నలుగురు పట్టభద్రులు రూపొందించిన ‘విజిట్‌’ అనే మొబైల్ యాప్‌ రోగుల్నీ, వైద్యుల్నీ అనుసంధానం చేసే వేదిక‌గా కృషి చేస్తోంది. ఏ సమయంలోనైనా స‌రే ఈ యాప్ ద్వారా ఉచితంగా వైద్యుల స‌ల‌హాలు సూచ‌న‌లు పొందొచ్చు. నిపుణులతో సంక్షిప్త సందేశాలు లేదా వీడియో కాల్‌ ద్వారా అనుసంధానం కావ‌చ్చు. బిట్స్‌-పిలానీకి చెందిన అనురాగ్‌ ప్రసాద్‌, వైభవ్‌ సింగ్‌, చేతన్‌ ఆనంద్‌, శాశ్వత్‌ త్రిపాఠి ఈ యాప్‌కు రూప‌క‌ల్ప‌న చేశారు. విజిట్ యాప్ ద్వారా స‌ల‌హాలివ్వ‌డానికి ఇప్పటికే వందకు పైగా అగ్రశ్రేణి వైద్యులు ఉన్నారు. మరో 200 మంది వరకు చేరబోతున్నారని అనురాగ్‌ప్రసాద్ మీడియాకు తెలిపారు. పైకి చెప్పుకోలేని స‌మ‌స్య‌ల‌కు ఈ యాప్ ప‌రిష్కారం చూపుతుంద‌ని పేర్కొన్నారు. భార‌త్‌లో చాలామంది ప్రజలు ఒత్తిడి, కుంగుబాటు వంటి రుగ్మతలతో బాధ పడుతున్నారని, అయితే వారు డాక్ట‌ర్ల వ‌ద్ద‌కు వెళ్ల‌డానికి సంశ‌యిస్తున్నార‌ని అనురాగ్‌ప్రసాద్ తెలిపారు. వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి విజిట్‌ మొబైల్‌ యాప్‌ ఉపయోగపడుతుంద‌న్నారు. మున్ముందు అన్ని ర‌కాల వ్యాధుల నిపుణుల‌ను ఇందులో అందుబాటులో ఉంచుతామ‌ని తెలిపారు.

More Telugu News