: నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియాలోని 88 శాతం కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు!

భారత్ లోని కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు వెల్లువలా రానున్నాయి. 88 శాతం కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకోనున్నాయని అంతర్జాతీయ రిక్రూట్ మెంట్ సంస్థ అంతాల్ ఇంటర్నేషనల్, నియామకాలు, ఉద్యోగుల తొలగింపు ట్రెండ్స్ పై జరిపిన సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఈ అధ్యయనం అనంతరం భారత్ కు సంబంధించినంత వరకూ, ప్రస్తుతం 63 శాతం కంపెనీల్లో నియామకాలు జరుగుతున్నాయి. 29 శాతం కంపెనీలు వివిధ కారణాలతో కొందరు ఉద్యోగులను తొలగించే పనిలో ఉన్నాయి. ఈ సర్వేలో ఇండియాలోని 2,292 కంపెనీలను భాగం చేశామని, ప్రొఫెషనల్స్, మేనేజింగ్ స్థాయిలో నియామకాలు అధికంగా జరుగనున్నాయని వెల్లడించింది. సెప్టెంబర్ 2014లో వేసిన అంచనాలతో పోలిస్తే నియామకాలు జరపాలని భావిస్తున్న కంపెనీల సంఖ్య 10 శాతం పెరిగిందని అంతాల్ ఇంటర్నేషనల్ ఎండీ జోసఫ్ దేవాసియా వెల్లడించారు. విద్యా రంగంలోని 78 శాతం కంపెనీలు, ఈ-కామర్స్ రంగంలో 74 శాతం, బీపీఓ కంపెనీల్లో 73 శాతం, ఐటీ కంపెనీల్లో 67 శాతం, బ్యాంకింగ్ కంపెనీల్లో 65 శాతం, ఫార్మా కంపెనీల్లో 62 శాతం, ఎఫ్ఎంసీజీ కంపెనీల్లో 60 శాతం కొత్త ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. జనవరి తరువాత హార్డ్ వేర్, ఎలక్ట్రానిక్స్, అకౌంటింగ్, మార్కెటింగ్, అడ్వర్టయిజింగ్ విభాగాల్లో ఉద్యోగుల నియామకాలు ప్రారంభం కానున్నాయని జోసఫ్ తెలిపారు.

More Telugu News