: ‘ప్రకాశం’ ప్రమాదంలో తగలబడిపోయిన ‘శ్రీకృష్ణ’ బస్సు... 10కి పెరిగిన మృతులు

ప్రకాశం జిల్లా కందుకూరు మండలం చెర్లోపల్లి వద్ద నేటి తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన బస్సును శ్రీకృష్ణ ట్రావెల్స్ కు చెందిన బస్సుగా గుర్తించారు. ప్రమాదంలో పెళ్లి బృందంతో వెళుతున్న డీసీఎం వ్యాన్ (చిన్న లారీ)ని ఆ బస్సు ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ట్రావెల్స్ బస్సు ఖాళీగా ఉందని తెలుస్తోంది. ఇక ప్రమాదం జరిగిన వెంటనే బస్సుతో పాటు డీసీఎం కూడా బోల్తా పడింది. ప్రమాదంలో చనిపోయిన వారంతా వ్యాన్ లోని పెళ్లి బృందం సభ్యులేనని తెలుస్తోంది. అంతేకాక ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా చనిపోయిన వారి సంఖ్య 10కి చేరుకుంది. చనిపోయిన వారిలో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారని సమాచారం. ప్రమాదంలో గాయపడ్డ 15 మంది పరిస్థితి కూడా విషమంగా ఉంది. వీరిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తర్వాత శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు రోడ్డుపైనే మంటల్లో తగలబడిపోయింది.

More Telugu News