: మూడు వారాల్లో పెట్టుబడిని రెట్టింపు చేసిన సంస్థ!

సెప్టెంబర్ 23న ఆ సంస్థ ఈక్విటీ విలువ రూ. 70.75 మాత్రమే. ఇప్పుడు ఆ విలువ రూ. 142కు చేరింది. కేవలం మూడు వారాల వ్యవధిలో పెట్టుబడిని రెట్టింపు చేసిన ఆ కంపెనీ ఏంటో తెలుసా? బీఎస్ఈలో లిస్టింగ్ అవుతున్న ఐటీ సేవల సంస్థ కెల్టన్ టెక్ సొల్యూషన్స్. ఈ మూడు వారాల్లో సెన్సెక్స్ కేవలం 3.7 శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేయగా, కెల్టన్ ఏకంగా 101 శాతం పెరిగింది. మంగళవారం నాడు సైతం ఈ సంస్థకు చెందిన 6.18 లక్షల ఈక్విటీలు చేతులు మారాయి. మరో 1.66 లక్షల ఈక్విటీలకు బై ఆర్డర్లు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సంస్థ వార్షికాదాయం 247 శాతం పెరగడం, జూన్ 30తో ముగిసిన సంవత్సరానికి రూ. 240 కోట్ల ఆదాయం నమోదు కావడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను పెంచిందని నిపుణులు వ్యాఖ్యానించారు. వచ్చే మూడేళ్లలో సంస్థ ఆదాయం రూ. 2 వేల కోట్లకు చేరుతుందన్న మార్కెట్ నిపుణుల అంచనాలు సంస్థ ఈక్విటీకి డిమాండ్ ను తీసుకొచ్చాయి. ఐ-ఎస్ఎంఏసీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ - సోషల్, మొబైల్, అనలిటిక్స్, క్లౌడ్) విభాగంలో సేవలందిస్తున్న ఈ సంస్థ ఇటీవల అభివృద్ధి చేసిన మొబైల్ యాప్ 'ఎంసేహత్' గర్భస్థ, శిశు మరణాల తగ్గింపునకు వాడాలని, ఈ మేరకు హెల్త్ వర్కర్లకు అందుబాటులో ఉంచాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించడం కూడా సంస్థ ఈక్విటీలను కొనుగోలు చేయాలన్న ఆలోచనను పెంచిందని తెలుస్తోంది.

More Telugu News