దైవానికి ఇలా నమస్కరించాలి

అనునిత్యం ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకునేవాళ్లు కొందరైతే, పర్వదినాల్లో .. విశేషమైన రోజుల్లో మాత్రమే ఆలయానికి వెళ్లి స్వామివారికి పూజాభిషేకాలు జరిపించేవాళ్లు కొందరు. ఆలయానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలనే ఎక్కువగా కోరుకుంటూ వుంటారు. అయితే ఈ సమయంలో భక్తులు స్వామివారికి ఎదురుగా నుంచుని ఆయన దర్శనం చేసుకుంటూ వుంటారు. అలా కాకుండా భక్తులు ఒక వైపున .. పక్కకి
నిలబడాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.

గర్భాలయంలోని మూలమూర్తికి కుడివైపున అర్చక స్వామి ఉండి పూజాభిషేకాలు నిర్వహించి హారతి ఇస్తాడు. అదంతా స్పష్టంగా కనిపించాలంటే, భక్తులు గర్భాలయం వెలుపల స్వామివారికి ఎడమపక్కన నిలబడవలసి ఉంటుంది. ఇక పెద్దలకి ఎదురుగా నిలబడి ఎలాగైతే నమస్కరించమో, అలాగే భగవంతుడికి కూడా ఎదురుగా నిలబడి నమస్కరించకూడదు. ఒక పక్కకి నిలబడే నమస్కరించవలసి ఉంటుంది. ప్రధాన దైవానికి ఎదురుగా హనుమంతుడు .. గరుత్మంతుడు .. నంది వంటి ..  ప్రతిమలు ఉంటాయి. వాటికి .. స్వామికి మధ్యలో నుంచోరాదనేది మరో కారణంగా పెద్దలు చెబుతుంటారు.

More Bhakti Articles