సోమవారం రోజున అరుణాచల ప్రదక్షిణ ఫలితం

పరమశివుడు పృథ్వీ లింగంగా .. ఆకాశ లింగంగా .. జల లింగంగా .. అగ్ని లింగంగా .. వాయు లింగంగా కొలువై ఆయా మహిమాన్విత క్షేత్రాల్లో పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. అలా ఆ దేవదేవుడు అగ్ని లింగంగా ఆవిర్భవించిన క్షేత్రమే 'అరుణాచలం'. ఈ క్షేత్రంలోని కొండయే సాక్షాత్తు శివ స్వరూపమని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ కొండ మధ్యభాగంలో స్వామివారు దక్షిణామూర్తిగా ధ్యానంలో ఉంటాడని భక్తులు విశ్వసిస్తూ వుంటారు.

అందువలన ఇక్కడి కొండకి ప్రదక్షిణం చేస్తే .. స్వామివారికి ప్రదక్షిణ చేసినట్టే అవుతుందని అంటారు. అందువలన భక్తులంతా కూడా దాదాపు 14 కిలోమీటర్ల పరిథి గల ఇక్కడి కొండకు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ చేస్తుంటారు. సాక్షాత్తు సదా శివుడి స్వరూపంగా చెప్పబడే ఈ కొండకి ఒక్కో రోజున ప్రదక్షిణ చేయడం వలన, ఒక్కో విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతారు. పరమశివుడికి సోమవారం అంటే ఇష్టం కనుక, చాలామంది ఆ రోజున ప్రదక్షిణ చేయడానికి ఆసక్తిని చూపుతుంటారు. శివ నామ స్మరణ చేస్తూ అరుణాచలానికి సోమవారం రోజున ప్రదక్షిణ చేయడం వలన, 'అపమృత్యు దోషం' తొలగిపోతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.   


More Bhakti News