అక్షయ తృతీయ రోజున ఇవి దానం చేయాలి

శ్రీమహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం .. వైశాఖ మాసం. అందువల్లనే ఈ మాసాన్ని మాధవ మాసం అని కూడా అంటారు. ఈ మాసంలో తులసీదళాలతో శ్రీమహా విష్ణువును పూజించడం వలన అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. వైశాఖ శుద్ధ తృతీయనే 'అక్షయ తృతీయ' అని అంటారు. ఈ రోజునే 'కృతయుగం' మొదలైందనీ .. క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి ఆవిర్భవించిందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ప్రహ్లాదుడికి నరసింహస్వామి దర్శనమిచ్చిన రోజు .. పరశురాముడు జన్మించిన రోజు ఇదే.

ఈ రోజున వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించడం .. లక్ష్మీదేవిని .. గణపతిని పూజించడం మంచిదని అంటారు. అక్షయ తృతీయ రోజు ఏ పుణ్య కార్యం చేసినా అది అక్షయంగా మారుతుందనేది మహర్షుల మాట. ఈ రోజున మంచి నీటిని .. పాదరక్షలను .. గొడుగును .. నూలు వస్త్రాలను .. దధ్యోదనం దానం చేయడం మంచిది. ఈ రోజున దానధర్మాలు చేయడం వలన లభించే పుణ్యం, జన్మజన్మల పాటు వెంట వస్తుందని అంటారు. తరువాత జన్మల్లో జీవుడు ఏ శరీరాన్ని ధరించినా, ఈ పుణ్య ఫలాలు ఆ జీవికి అందుతూ  ఆకలిదప్పులకు అలమటించే అవసరం లేకుండా కాపాడుతూ ఉంటాయట. అందువలన అక్షయ తృతీయ రోజున ఎవరి స్థాయిలో వాళ్లు దానధర్మాలు చేయడం మంచిది.    


More Bhakti News