అందుకోసమే వరదలు వచ్చాయని అంటారు

అందుకోసమే వరదలు వచ్చాయని అంటారు
సాధారణ ఆలయాలలోనే కాదు ... విశిష్టమైన పుణ్యక్షేత్రాల్లోను ఒక్కోసారి దొంగతనాలు జరుగుతూ వుంటాయి. ఆలయాలలో గల పంచలోహ మూర్తులు అత్యంత ఖరీదైనవిగా చెప్పబడుతుంటాయి కనుక, ఎక్కువగా అవి దొంగతనానికి గురవుతుంటాయి. అయితే అలా దొంగిలించబడిన పంచలోహ మూర్తులు బయటపడినతీరు ... అనతికాలంలోనే తిరిగి ఆలయానికి చేరుకున్న విధానాన్ని బట్టి అది దైవ మహిమగానే భక్తులు భావిస్తుంటారు.

ఇలాంటి ఆసక్తికరమైన సంఘటన ఒకటి 'సురుటుపల్లి' లోను జరిగింది. చిత్తూరు జిల్లా పరిధిలో గల ఈ క్షేత్రంలో శివుడు శయన ముద్రలో కనిపించడం విశేషం. ఎక్కడ చూసినా లింగరూపంలో దర్శనమిచ్చే శివుడు, ఇక్కడ విగ్రహ రూపంలో .. అందునా శయన ముద్రలో కనిపించడం ఆశ్చర్యకరంగా అనిపిస్తూ వుంటుంది. కాలకూట విషాన్ని మింగిన శివుడు, ఆ ప్రభావాన్ని తట్టుకోలేక అమ్మవారి ఒడిలో సేదదీరాడని ఇక్కడి స్థలపురాణం చెబుతోంది.

ఈ ఆలయంలో గల నటరాజస్వామి పంచలోహ మూర్తిని భక్తులు విశేషంగా దర్శించుకుంటూ వుంటారు. చాలకాలం క్రితం కొంతమంది దొంగలు ఈ విగ్రహాన్ని దొంగిలించి, దానితో ఎక్కువ దూరం పారిపోలేక ఇక్కడి నది ఇసుకలో రహస్యంగా దాచారట. స్థానికులు ఎంతగా వెదికినా ప్రయోజనం లేకపోయింది. స్వామికి తాము ఏ లోటూ చేయనట్టయితే అనతికాలంలోనే అయన తిరిగివస్తాడని వాళ్లంతా బలంగా విశ్వసించారు.

అలా వాళ్లు అనుకున్న కొంతకాలానికే హఠాత్తుగా వరదలు రావడంతో, ఇసుకలో దాచబడిన పంచలోహ ప్రతిమ బయటపడింది. భక్తులు ఆనందోత్సాహాలతో ఈ విగ్రహాన్ని తిరిగి ఆలయానికి చేర్చడం జరిగింది. ఈ విగ్రహం బయటపడేందుకే వరదలు వచ్చినట్టుగా భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ క్షేత్రం మహిమాన్వితమైనదని మనస్పూర్తిగా చెబుతుంటారు.

More Bhakti Articles