శత్రువులపై విజయాన్ని తెచ్చిపెట్టే అభిషేకం !

శత్రువులపై విజయాన్ని తెచ్చిపెట్టే అభిషేకం !
ఎక్కడ అభివృద్ధి జరుగుతూ వుంటుందో ... ఎక్కడ సంపదలు పెరుగుతూ ఉంటాయో అక్కడి నుంచే శత్రువులు పుట్టుకొస్తూ వుంటారు. సాధారణంగా తాము ఎవరికీ ఎలాంటి హాని చేయలేదు కాబట్టి, తమకి శత్రువులు ఎవరూ ఉండరని కొంతమంది అనుకుంటూ వుంటారు. నిజానికి అలా అనుకోవడం అమాయకత్వంగానే చెప్పుకోవాలి. జీవితంలో అంచెలంచలుగా ఎదుగుతున్న ప్రతి ఒక్కరూ మరో వైపునుంచి ప్రమాదాలకి దగ్గరగా వెళుతూ వుంటారు. ఎందుకంటే వారి ఎదుగుదలను చూసి సహించలేని వాళ్లు, శత్రువులుగా మారుతుంటారు.

ఇలాంటి వాళ్లు అవతలి వ్యక్తులను మానసికంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు. కుదరకపోతే ప్రాణాలకే హాని తలపెడుతుంటారు. ఇలాగే అడిగిన సాయం చేయలేదనీ, తమకు రావలసిన దానిని చేజిక్కించుకున్నారని శత్రువులు తయారవుతూ వుంటారు. ఊహించడం జరగదు కనుక, ఇలాంటి వారి బారి నుంచి ఆ పరమశివుడే రక్షించవలసి వుంటుంది. అందుకే ఆదిదేవుడికి 'నువ్వుల నూనె'తో అభిషేకం చేయాలని శాస్త్రం చెబుతోంది.

నువ్వుల నూనెతో శివుడిని అభిషేకించడం వలన, దెబ్బతీయడానికి శత్రువులు పన్నిన పన్నాగాలు ఫలించవు. వాళ్లు ఎలాంటి పథకాలు రచించినా, దైవానుగ్రహం కలిగిన వాళ్లే విజయాన్ని సాధిస్తూ వుంటారు. ఈ అభిషేక ఫలితంగా శత్రువులు దూరం కావడం ... తమ మనసు మార్చుకుని మిత్రులుగా మారిపోవడం జరుగుతూ వుంటుంది.

అందువలన శత్రువులు ఎక్కువగా ఉన్నవాళ్లు, వాళ్ల కారణంగా ఆటంకాలు ఎదుర్కుంటోన్న వాళ్లు శివుడిని నువ్వుల నూనెతో అభిషేకించాలి. అందువలన శత్రువులు సృష్టించే అవాంతరాలను అవలీలగా దాటుకుని, అభివృద్ధి పథంలో ముందుకు సాగిపోవడం జరుగుతుంది. శివానుగ్రహంతో శత్రువులపై విజయాన్ని సాధించడం జరుగుతుంది.

More Bhakti Articles