పరమశివుడి పరీక్షకు ఎవరు నిలువగలరు ?

పరమశివుడి పరీక్షకు ఎవరు నిలువగలరు ?
హరిశ్చంద్ర మహారాజు తన రాజ్యంలోని ప్రజలను కన్నబిడ్డలవలే చూసుకుంటూ వుంటాడు. ప్రజలంతా తమ తమ వృత్తులలో శ్రమిస్తూ ... ఇతరులకు సాయపడుతూ ... దైవారాధన చేస్తూ సుఖశాంతులతో జీవించసాగారు. అలాంటి పరిస్థితుల్లోనే హరిశ్చంద్ర మహారాజు నూరవ రాజసూయ యాగాన్ని పూర్తిచేసి ఒక దివ్యమణిని యజ్ఞఫలంగా పొందుతాడు.

ఆ యజ్ఞ ఫలాన్ని దర్శించుకున్నవారు ధన్యులవుతారని వశిష్ఠ మహర్షి చెప్పడంతో, హరిశ్చంద్రుడు తన రాజ్యంలోని ప్రజలు దానిని చూడటానికి ఏర్పాట్లు చేయిస్తాడు. రాజసూయ యజ్ఞ ఫలాన్ని చూడటానికి ప్రజలంతా పెద్ద సంఖ్యలో రాజుగారి ఆస్థానానికి చేరుకోసాగారు. హరిశ్చంద్ర మహారాజు దాన గుణాన్ని పరీక్షించాలనుకున్న పరమశివుడు, ఓ సాధువు రూపంలో అక్కడికి చేరుకుంటాడు.

హరిశ్చంద్రుడు ఆస్థానంలో కొలువుదీరగానే, ఆ సాధువు లోపలికి ప్రవేశిస్తాడు. హరిశ్చంద్రుడి గుణగణాలను గురించి తెలుసుకుని, తాను కోరినది ఆయన తప్పని సరిగా ఇస్తాడనే విశ్వాసంతో వచ్చినట్టు చెబుతాడు. ఎవరి అభ్యర్థనను తాము ఎప్పుడూ కాదనలేదనీ, విషయమేమిటో సెలవీయమని హరిశ్చంద్రుడు అడుగుతాడు. దాంతో ఆ సాధువు యజ్ఞఫలాన్ని తనకి దానంగా ఇవ్వమని కోరతాడు.

ఆ మాట విని ఆస్థానంలోని వారంతా ఆశ్చర్య పోతారు. ఆ యజ్ఞ ఫలాన్ని ఇతరులకు దానంగా ఇవ్వడం అంత మంచిది కాదని మహామంత్రి సలహా ఇస్తాడు. దానాన్ని కోరినది ఓ సాధారణ సాధువుగా తనకి అనిపించడం లేదనీ, ఆయనని చూడగానే తనకి అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతోందని హరిశ్చంద్రుడు అంటాడు. వచ్చినది ఎవరైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం రాజుగా తన ధర్మమనీ, అది తన వంశ ప్రతిష్ఠకు సంబంధించిన విషయమని అంటాడు.

అందరి సమక్షంలోనే హరిశ్చంద్రుడు ఆనందంగా ఆ యజ్ఞ ఫలాన్ని సాధువుకి అందజేస్తాడు. అంతటి విశిష్టమైన యజ్ఞ ఫలాన్ని ఏ మాత్రం సందేహించకుండా తనకి ఆయన దానంగా ఇవ్వడం చూసి ఆదిదేవుడే ఆశ్చర్యపోతాడు. హరిశ్చంద్రుడి దానగుణాన్ని మనసులోనే అభినందిస్తూ ... ఆశీర్వదిస్తూ అక్కడి నుంచి నిష్క్రమిస్తాడు.

More Bhakti Articles