ఆలయాల్లో ఈ విషయం మరిచిపోకూడదు

ఆలయాల్లో ఈ విషయం మరిచిపోకూడదు
ఆలయాలు భక్తులకు పుణ్యఫలాలను ప్రసాదించే నిలయాలుగా అలరారుతుంటాయి. సువిశాలమైన ప్రదేశం ... పచ్చని చెట్లు ... కోనేరు ... ఆహ్లాదకరమైన వాతావరణం ఆనందాన్ని కలిగిస్తుంటాయి. దేవుడి అనుగ్రహంతో పాటు, ఆయన సన్నిధిలోని ప్రశాంతతను ఆస్వాదించడానికి భక్తులు ఎక్కువగా వస్తుంటారు.

దైవదర్శనం కోసం వచ్చే భక్తులు స్వామివారికి సమర్పించడం కోసం అరటిపండ్లు ... కొబ్బరికాయలు తెస్తుంటారు. ఇవంటే కోతులకు మహా ఇష్టం. అటు తాగడానికి కోనేటిలో నీళ్లు పుష్కలంగా వుంటాయి. ఇటు తినడానికి పండ్లు ... కొబ్బరి చిప్పలు దొరుకుతుంటాయి. ఇక నివాస స్థానంగా నీడనిచ్చే చెట్లు ఎలాగూ వుంటాయి. అందువలన ఆలయాల ప్రాంగణంలో కోతుల సంఖ్య పెరుగుతుందే కానీ తగ్గదు.

కొందరు భక్తులు వీటికి భయపడుతూనే తాము వచ్చిన పని చూసుకుని వెళుతుంటారు. మరికొందరు తాము దైవదర్శనం కోసం వచ్చామనే విషయాన్ని పక్కనపెట్టి కోతులను తరుముతుంటారు. నిజానికి అవి తమకి హాని చేయనంత వరకూ ఎవరినీ ఏమీ అనవు. అవి ఆలయంపై ఆధారపడి జీవిస్తున్నాయి కనుక వాటిని తరమడం ... గాయపరచడం చేయకూడదు. నిజానికి కొబ్బరి చిప్పలు ... పండ్లు వంటివి వాటికి పెట్టడం వలన ఎంతో పుణ్యం వస్తుంది. వాటి ఆకలి తీర్చిన సంతృప్తి కలుగుతుంది.

కొన్ని ఆలయాలవాళ్లు పావురాలను పెంచుతూ వాటి ఆహారానికి అవసరమైన ఖర్చు కోసం ప్రత్యేకంగా హుండీ పెడుతుంటారు. అలాగే ఆలయానికి సంబంధించిన గోవుల విషయంలోనూ చేస్తుంటారు. అలాంటి వాటికి ఎవరికి తోచిన సాయం వాళ్లు చేయాలి. మూగ జంతువులకు, పక్షులకు ఆహారాన్ని సమర్పించే ... సమకూర్చే అవకాశం ఇంటిదగ్గర ఎలాగో వుండదు. కాబట్టి ఆలయానికి వెళ్లినప్పుడు వాటిని గుర్తుపెట్టుకుని మరీ ఆహారాన్ని అందించాలి.

ఇక ఆలయ సమీపంలో నదులు ... వాగుల వంటివి వుంటే, వాటిలోని జీవరాశికి కూడా ఆహారాన్ని అందించడం మరచిపోకూడదు. భగవంతుడిని దర్శించడం వల్లనే కాదు, ఇతర జీవరాశికి ఆహారాన్ని అందించడం వలన కూడా అనంతమైన పుణ్యం లభిస్తుందని గ్రహించాలి.

More Bhakti Articles