విద్యను ప్రసాదించే విశిష్ట క్షేత్రం

విద్యను ప్రసాదించే విశిష్ట క్షేత్రం
విద్య అనేది విజ్ఞానాన్ని ... వివేకాన్ని పెంచుతుంది. చైతన్య వంతులను చేసి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమైన తెలివితేటలను ఇస్తుంది. విద్య వున్న చోటుకి సంపదలు ... కీర్తి ప్రతిష్ఠలు వెతుక్కుంటూ వస్తాయి. విద్య ఉత్తమమైన మార్గమేదో సూచిస్తూ ఉన్నతమైన స్థానానికి చేరుస్తుంది.

ఈ కారణంగానే తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకోవాలని ఆశిస్తూ వుంటారు. సకల విద్యలను ప్రసాదించే సరస్వతీ అమ్మవారి అనుగ్రహం తమ పిల్లలకి లభించాలని కోరుకుంటారు. అలాంటి వారి ప్రార్ధనలు ఫలింపజేసే సరస్వతీ క్షేత్రం మనకి మెదక్ జిల్లా 'అనంతసాగరం'లో దర్శనమిస్తుంది.

విశాలమైన ప్రదేశంలో ... ప్రశాంతమైన వాతావరణంలో విలసిల్లుతోన్న ఈ ఆలయం చూడగానే, ఇది ఎంతో విశిష్టమైన విద్యా క్షేత్రమనే విషయం బోధపడుతుంది. ప్రాచీన కాలంలో ఇక్కడ ఎంతో మంది మునులు ... సిద్ధులు తపస్సు చేసుకున్న ఆనవాళ్లు కనిపిస్తాయి. ఈ ప్రదేశంలో తపస్సు చేసుకునేందుకు అనుకూలంగా రాతి గుహలు ... గుహల వంటి దోనెల్లో సహజంగా ఏర్పడిన జలాలు కనిపిస్తాయి.

భక్తులు ఈ దోనెల్లో నీటిని తమతో తీసుకువెళ్లి పంటపొలాల్లో చల్లుతూ వుంటారు. ఈ విధంగా చేయడం వలన పంటలు బాగా పండుతాయనే విశ్వాసాన్ని వాళ్లు వ్యక్తం చేస్తుంటారు. ఇంతటి మహిమాన్వితమైన ఈ ప్రదేశంలో తనకి ఆలయాన్ని నిర్మించమని ఓ భక్తుడిని అమ్మవారు ఆదేశించిందట. ఫలితంగా ఇక్కడ అమ్మవారి ఆలయం నిర్మితమై అనతికాలంలోనే ప్రసిద్ధి చెందింది.

గర్భాలయంలో అమ్మవారి మూలమూర్తి నుంచుని వుండటం ఇక్కడి విశేషం. ఇక్కడి అమ్మవారిని ప్రార్ధించడం వలన విద్యార్థులు ఉత్తీర్ణతను సాధించి ఉన్నతమైన స్థానాలను అలంకరిస్తారని అంటారు. తల్లిదండ్రులు తమ పిల్లలను వెంటబెట్టుకుని ఈ క్షేత్రానికి వస్తుంటారు. తమ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దవలసిన బాధ్యతను అమ్మవారికి అప్పగిస్తూ కానుకలు సమర్పిస్తూ వుంటారు.

More Bhakti Articles