పరమాత్ముడిని కదిలించే పతిసేవ

పరమాత్ముడిని కదిలించే పతిసేవ
నర్మద జాతకం ఆమె వివాహానికి అడ్డుపడుతూ వుంటుంది. ఆమె ఆవేదనను అర్థం చేసుకున్న అనసూయాదేవి, సూర్యోదయ వేళలో ముందుగా ఎదురుపడిన వ్యక్తిని వివాహమాడమని చెబుతుంది. ఆ సమయానికి కురూపి అయిన ఓ అంధుడు ఎదురుపడటంతో నర్మద ఆయనని భర్తగా భావిస్తుంది. చక్రాల బండిలో భర్తను కూర్చోబెట్టి లాగుతూ, క్షేత్రదర్శనం చేస్తూ వుంటుంది.

ఈ నేపథ్యంలో ఆమె ఓ నిర్జన ప్రదేశానికి చేరుకుంటుంది. తనకి విపరీతమైన దాహంగా వుందని భర్త చెప్పడంతో, బండిలోని ఖాళీ కుండ తీసుకుని నీళ్ల కోసం వెతుకుతూ వుంటుంది. లక్ష్మీదేవి ... సరస్వతీదేవి ... పార్వతీదేవి ఆమె ఆరాటాన్ని గమనిస్తారు. నర్మద పాతివ్రత్యాన్నీ ... ఆమెకు సహకరిస్తోన్న అనసూయామాత పాతివ్రత్య మహిమను పరీక్షించడానికి అంతకు మించిన అవకాశం దొరకదని భావిస్తారు.

మారువేషాల్లో నర్మద దగ్గర ప్రత్యక్షమై, మంచినీళ్ల కోసం ఆ ప్రాంతంలో వెదకడం వలన ప్రయోజనం ఉండదని చెబుతారు. ఆ ప్రదేశాన్ని రక్తంతో అభిషేకించడం వలన మాత్రమే భూమిలో నుంచి నీరు పొంగుకొస్తుందని అంటారు. దాంతో ఎంత మాత్రం ఆలోచించకుండా నర్మద తన కాలును ఖండించుకుంటుంది. ఆ రక్తం భూమిపై పడగానే జలధార భూమిలో నుంచి పైకి తన్నుకు వస్తుంది. ఆమె పాతివ్రత్యం ఎంతటిదో చూసి త్రిమాతలు ఆశ్చర్య చకితులవుతారు.

నీటికుండ తీసుకుని ఒంటికాలుతో భర్తను చేరుకోలేక అవస్థలు పడుతూ ఆమె అనసూయామాతను తలచుకుంటుంది. ఆమె ఆవేదన అనసూయామాతకు క్షణాల్లో చేరిపోతుంది. వెంటనే ఆమె నర్మదకు సహాయపడవలసిందిగా పరమాత్ముడిని ప్రార్ధిస్తుంది. అంతే నర్మద కోల్పోయిన కాలు తిరిగివస్తుంది. ఆ దృశ్యం చూసి త్రిమాతలు తమ కళ్లను తామే నమ్మలేకపోతారు. అనసూయామాతకు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుని, భర్త దాహం తీర్చి ఆయన ప్రాణాలను నర్మద కాపాడుకుంటుంది.

More Bhakti Articles