చిట్లిపోయిన అపెండిక్స్ కు ఏపీలోనే రెండవ అరుదైన చికిత్స

Related image

  • ఎండోస్కోపీక్‌ అల్ట్రాసౌండ్ తో వ్య‌క్తికి ప్రాణ‌దానం
  • పెద్ద ఆప‌రేష‌న్ ను త‌ప్పించి అధునాత‌న చికిత్సనందించిన కిమ్స్ డాక్ట‌ర్ రాజేంద్ర ప్రసాద్
క‌ర్నూలు, ఫిబ్ర‌వ‌రి 24, 2021: మాన‌వ శ‌రీరంలో అపెండిక్స్ అవ‌శేషావ‌య‌మే అయినా దానికి ఏదైనా ఇన్‌ఫెక్ష‌న్ వ‌చ్చి ప‌గిలిపోతే ప్రాణాలు కూడా పోవ‌చ్చు. అయితే స‌రిగ్గా ఇటువంటి ప‌రిస్థితిలోనే ఆస్ప‌త్రికి వ‌చ్చిన వ్య‌క్తికి అరుదైన అధునాత‌న చికిత్సనందించి కిమ్స్ క‌ర్నూలు డాక్ట‌ర్లు ప్రాణాలు నిలిపారు. కిమ్స్ క‌ర్నూలు ప్ర‌ముఖ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జిస్ట్ డాక్ట‌ర్ రాజేంద్ర ప్రసాద్ రోగి, చికిత్స అందించిన తీరును వివ‌రించారు.

క‌ర్నూలు జిల్లా ఉయ్యాల వాడ‌కు చెందిన బొల్లు త్యాగ‌రాజు తీవ్ర‌మైన క‌డుపునొప్పి, స్వ‌ల్ప జ్వ‌రంతో క‌ర్నూలు కిమ్స్ ఆస్ప‌త్రిలోని ఔట్ పేషెంట్ డాక్ట‌ర్ల‌ను సంప్ర‌దించారు. అత‌డిని ప‌రిశీలించి ప‌రిస్థితిని గ‌మ‌నించిన‌ డాక్ట‌ర్లు వెంట‌నే క‌డుపు భాగాన్ని సీటీ స్కాన్ చేయించారు. స్కాన్ రిపోర్టులో అపెండిక్స్ కు ఇన్ ఫెక్ష‌న్ సోకి బాగ వాచిపోయి చిల్లులు ప‌డి క్ర‌మంగా ఇన్ఫెక్ష‌న్ ద్ర‌వాలు,‌ చీము, క‌డుపులోకి లీక్ అవుతున్న‌ట్లు గ‌మ‌నించారు. దాదాపు 600 ml చీము అపెండిక్స్ చుట్టూ మరియు పెల్విక్ భాగంలో ఉన్నట్టు గుర్తించారు. క‌డుపుకు శ‌స్త్ర ‌చికిత్స చేసి లీక్ అవుతున్న‌ చీము ద్ర‌వాల‌ను తొల‌గించ‌క‌పోతే ప్రాణాల‌కే ప్ర‌మాద‌మ‌ని గ‌మ‌నించి రెండు దశల్లో శ‌స్త్ర‌చికిత్స‌ చేయాల‌ని స‌ర్జ‌న్లు నిర్ణ‌‌యించారు.

మొదట చీము తీసివేసేందుకు పెద్ద ఆపరేషన్ అవసరం అని నిర్ణయించారు. మొదటి ఆపరేషన్ సక్సెస్ అయిన ఆరు వారాల తర్వాత అపెండిక్స్ తీసివేయటం కోసం కోసం రెండో ఆపరేషన్ అవసరమని తెలియజెప్పారు. అయితే  ప్ర‌ముఖ గ్యాస్ట్రోఎంట్రాల‌జిస్ట్ డాక్ట‌ర్ యల్. రాజేంద్ర ప్ర‌సాద్ ను డాక్ట‌ర్లు సంప్ర‌దించ‌గా శ‌స్త్ర‌చికిత్స కంటే ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ద్వారా చికిత్స‌ ఉత్త‌మ‌మ‌ని సూచించారు. ఈ ప్రక్రియలో చీమును ఎండోస్కోపీ ద్వారా పేగ లోనికి మళ్లిస్తారు. ఈ ప్రక్రియలో శరీరం పై భాగంలో ఎక్కడ కోత ఉండదు.

వెంట‌నే డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్‌ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ చికిత్స‌ద్వారా క‌డుపులోని ద్ర‌వాల‌ను పూర్తిగా తొల‌గించారు. దాంతో పేషెంట్ 3 రోజుల్లోనే పూర్తిగా కోలుకుని సాధారణ స్థితికి చేరుకున్నారు. ఎండోస్కోపీ చికిత్స అనంత‌రం మ‌రో సారి సీటీ స్కాన్ చేసి ప‌రిశీలించ‌గా క‌డుపులోని అన్ని అవ‌య‌వాలు ఆరోగ్యంగా ఉన్నాయి. రోగి ఎటువంటి స‌ర్జ‌రీ లేకుండానే పూర్తిగా కోలుకొని సాధార‌ణ స్థితికి చేరుకున్న‌ట్లు ఆయ‌న వివరించారు. మళ్లీ మళ్లీ అపెండిక్స్ కి ఇన్ఫెక్షన్ రాకుండా ఆరు వారాల తర్వాత అపెండిక్స్ ను సర్జరీ ద్వారా తొలగించాల్సిన అవసరం ఉంది.

ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ రాజేంద్ర ప్ర‌సాద్ మాట్లాడుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఇది రెండవ అరుదైన ఆప‌రేష‌న్ అని తెలిపారు. అధునాతన పరికరాలతో సరైన రీతిలో చీము తీసివేయడం వల్ల పెద్ద ఆపరేషన్ లేకుండా రోగిని సాధార‌ణ స్థితికి తీసుకురాగలిగామ‌ని ఆయ‌న వివరించారు.

More Press Releases