Mancherial District: పెళ్లి చేసుకుంటానని ఇంటి నుంచి తీసుకెళ్లి మోసం చేసిన ప్రియుడు.. సెల్ఫీ వీడియో తీసుకుని యువతి ఆత్మహత్య

  • మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఘటన
  • ఇంటి నుంచి తీసుకెళ్లాక తప్పించుకు తిరుగుతున్న వైనం
  • పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్యాయత్నం
  • మంచిర్యాల జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
Young Girl Committed Suicide after lover cheeted

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇంటి నుంచి తీసుకెళ్లి ఆపై మోసం చేయడంతో జీర్ణించుకోలేకపోయిన యువతి ఆత్మహత్య చేసుకుంది. అంతకంటే ముందు తన వేదనను సెల్ఫీ వీడియో ద్వారా పంచుకుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స్థానిక షంషీర్ నగర్‌కు చెందిన తేజశ్రీ, నెన్నెల మండలం లంబాడితండాకు చెందిన ధరావత్ రాజ్ కుమార్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతిని ఇంటి నుంచి తీసుకెళ్లిన రాజ్‌కుమార్ ఆమెను ఓ చోట ఉంచాడు. అయితే, ఆ తర్వాత అతడు పెళ్లి ఊసెత్తకపోగా, తప్పించుకు తిరుగుతుండడంతో తాను మోసపోయానని యువతి గ్రహించింది.

మనస్తాపంతో పురుగుల మందు తాగి తన ఊరైన లంబాడితండాకు ఆటోలో బయలుదేరింది. ఈ క్రమంలో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. గమనించిన ఆటో డ్రైవర్ వెంటనే ఆమెను స్థానిక పీహెచ్‌సీ సెంటర్‌కు తరలించాడు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. తాజాగా, ఆమె సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. రాజ్‌కుమార్‌ను నమ్మి అందరినీ వదిలేసి ఇంటి నుంచి వచ్చేశానని, ఇప్పుడు అతడు తప్పించుకుని తిరుగుతున్నాడని, ఇక తనకు దిక్కెవరని సెల్ఫీ వీడియోలో కన్నీరు పెట్టుకుంది. తనకు అన్యాయం జరిగిందని వాపోయింది.

More Telugu News