Kollywood: నయన్–విఘ్నేశ్ వివాహ వేడుకలో షారూక్ సందడి.. హాజరైన మహామహులు!

  • ఇవాళ ఉదయం మహాబలిపురంలో వివాహం
  • అట్లీతో కలిసి హాజరైన బాలీవుడ్ బాద్ షా
  • రజనీకాంత్, విజయ్, కార్తీ, బోనీ కపూర్ తదితరుల హాజరు
Sharukh Attended the Most Awaited Wedding Of Nayan And Vignesh

ఎట్టకేలకు నయనతార, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తమిళనాడులోని మహాబలిపురం షెరటాన్ హోటల్ లో ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వివాహ వేడుక జరిగింది. బాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు వారి పెళ్లి వేడుకకు హాజరయ్యారు. బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ వివాహానికి హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. 

ప్రస్తుతం తాను నటిస్తున్న 'జవాన్' చిత్ర దర్శకుడు అట్లీతో కలిసి శుభకార్యానికి హాజరయ్యారు. ఆయనతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్, దళపతి విజయ్, దర్శకుడు మణిరత్నం, కార్తీ, రాధికా శరత్ కుమార్ దంపతులు, నిర్మాత బోనీకపూర్, నెల్సన్ దిలీప్ కుమార్ పలువురు సెలబ్రిటీలు వేడుకకు హాజరయ్యారు. కాగా, పెళ్లి రోజును పురస్కరించుకుని తమిళనాడు వ్యాప్తంగా లక్ష మందికి భోజనం పెట్టాలని కొత్త జంట నిర్ణయించుకుందని తెలుస్తోంది. 

అదికాకుండా మరో 1,800 మంది చిన్నారులకూ కడుపునిండా విందునివ్వాలని నిర్ణయించారట. ఇప్పటికే అభిమానులతో ఆ ఏర్పాట్లన్నీ చేసినట్టు తెలుస్తోంది. ఇక, వారిద్దరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను ఇవాళే విఘ్నేశ్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తారని తెలుస్తోంది.

More Telugu News