Road Accident: గోవా నుంచి వస్తూ కల్వర్టులో పడి తగలబడిన బస్సు.. 8 మంది హైదరాబాద్ వాసుల సజీవ దహనం

  • గోవా నుంచి వస్తుండగా కలబురిగిలో ప్రమాదం
  • మృతుల్లో ఇద్దరు చిన్నారులు
  • రెండు కుటుంబాల గోవా టూర్ విషాదాంతం
Tourist Bus From Goa To Hyderabad Catches Fire Killed 8

గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న టూరిస్ట్ బస్సులో మంటలు చెలరేగి 8 మంది సజీవ దహనమయ్యారు. ఈ దారుణ ఘటన ఇవాళ తెల్లవారుజామున కర్ణాటకలోని కలబురిగిలో జరిగింది. చనిపోయిన వాళ్లంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. అర్జున్ కుమార్ (37), అతడి భార్య (32), బివాన్ (4), దీక్షిత్ (9), అనితా రాజు (40), శివ కుమార్ (35), రవళి (30) అనే వ్యక్తులు సజీవ దహనమైనట్టు తేల్చారు. మరొక వ్యక్తిని గుర్తించాల్సి ఉంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారు.

రెండు కుటుంబాలకు చెందిన 32 మంది ఆరెంజ్ ట్రావెల్స్ బస్సును మాట్లాడుకుని గోవా విహారయాత్రకు వెళ్లినట్టు సమాచారం. తిరుగు ప్రయాణంలో గోవా నుంచి హైదరాబాద్ కు వస్తుండగా కలబురిగి జిల్లా కమలాపురలో ఓ మినీలారీని ఢీకొట్టిన బస్సు.. కల్వర్టులో పడిపోయింది. క్షణాల్లోనే బస్సుకు మంటలంటుకుని తీవ్రరూపం దాల్చాయి. 

ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, సహాయకుడు సహా 35 మంది ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన కొందరు ప్రయాణికులు బయటకు దూకేశారు. గాయపడిన మరో 12 మందిని స్థానికులు కలబురిగి ఏరియా ఆసుపత్రికి తరలించారు.   

More Telugu News