Johnny Depp: మాజీ భార్యపై రూ. 380 కోట్ల పరువునష్టం దావా వేసిన హాలీవుడ్ స్టార్ హీరో!

  • 2015లో నటి అంబర్ హెర్డ్ ను వివాహం చేసుకున్న జానీ డెప్
  • పెళ్లైన రెండేళ్లకే విడాకులు తీసుకున్న జంట
  • జానీ డెప్ కు వ్యతిరేకంగా వ్యాసం రాసిన అంబర్ హెర్డ్
  • ఆమే తనను కొట్టేదన్న జానీ డెప్
  • మానసికంగా చాలా వేధించిందని ఆవేదన
Jonny Depp files defamation suit against his ex wife Amber Heard

జానీ డెప్... హాలీవుడ్ అగ్ర నటుల్లో ఒకరు. 'పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్' చిత్రంతో ఆయన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. మరోవైపు, ప్రస్తుతం ఆయన తన మాజీ భార్య, నటి అంబర్ హెర్డ్ తో పోరాడుతున్నారు. తన పరువును దెబ్బతీసేలా ఆమె రాసిన వ్యాసంపై ఆయన కోర్టుకెక్కారు. ఆమెపై రూ. 380 కోట్లకు పరువునష్టం దావా వేశారు. 

అంబర్ హెర్డ్ తో మూడేళ్ల పాటు డేటింగ్ చేసిన అనంతరం... 2015లో ఆమెను జానీ డెప్ రెండో వివాహం చేసుకున్నారు. అయితే వివాహం జరిగిన ఏడాదికే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో, విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే, జానీ డెప్ తో విడిపోయిన తర్వాత కూడా తను గృహహింసకు గురయ్యానంటూ ఆమె ఒక వ్యాసం రాశారు. ఈ వ్యాసం వైరల్ అయింది. పెద్ద చర్చనీయాంశంగా మారింది. 

ఈ క్రమంలో ఈ వ్యాసంలో పేర్కొన్న అంశాలపై జానీ డెప్ కోర్టును ఆశ్రయించారు. తన మాజీ భార్యపై రూ. 380 కోట్లకు పరువునష్టం దావా వేశారు. ప్రస్తుతం ఈ కేసు వర్జీనియా కోర్టులో కొనసాగుతోంది. ఈ సందర్భంగా తన మాజీ భార్య చేసిన ఆగడాలను జానీ కోర్టులో ఏకరువు పెట్టారు. 

పెళ్లయిన ఏడాదికే ఇద్దరి మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయని జానీ తెలిపారు. ఆమె తనను కొట్టేదని వెల్లడించారు. అసభ్యకరమైన మాటలతో తనను వేధిస్తూ, మానసిక వేదనకు గురి చేసేదని తెలిపారు. వైన్ గ్లాస్, టీవీ రిమోట్ తన తలపైకి విసిరేదని, ఇష్టం వచ్చినట్టు వ్యవహరించేదని పేర్కొన్నారు. బెడ్ పై మానవ మలం ఉంచేదని, తనను హింసిస్తూ, అవమానించేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణ రెండో వారం కూడా వాయిదా పడింది. వచ్చే వారం విచారణ కొనసాగనుంది.

More Telugu News