Sydney Test: మరొక్క రోజు ఆట మిగిలుంది...  టీమిండియా ఆశలన్నీ వాళ్లపైనే!

  • సిడ్నీ టెస్టులో ముగిసిన నాలుగో రోజు ఆట
  • భారత్ టార్గెట్ 407 పరుగులు
  • రెండో ఇన్నింగ్స్ లో భారత్ స్కోరు 98/2
  • క్రీజులో రహానే, పుజారా
  • ఫిఫ్టీ సాధించి అవుటైన రోహిత్
Fourth day play ends in Sydney test

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీలో జరుగుతున్న మూడో టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసింది. 407 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా ఇవాళ ఆట చివరికి 2 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 52, శుభ్ మాన్ గిల్ 31 పరుగులు చేశారు. వీరిద్దరూ అవుట్ కావడంతో పుజారా, రహానే బరిలో దిగారు. టీమిండియా విజయానికి ఇంకా 309 పరుగులు అవసరం కాగా, పుజారా 9, రహానే 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఆటకు మరొక్క రోజు మాత్రమే మిగిలుండగా, టీమిండియా ఆశలన్నీ ఈ జోడీపైనే ఉన్నాయి. పుజారా, రహానే భారీ భాగస్వామ్యం నమోదు చేస్తే విజయం కష్టమేమీ కాదు కానీ, సొంతగడ్డపై ఆసీస్ బౌలింగ్ ను ఎదుర్కొని అన్ని పరుగులు చేయగలరా అనేది సందేహమే!

అంతకుముందు,  ఓవర్ నైట్ స్కోరు 103/2తో నాలుగో రోజు ఉదయం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్  312/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. లబుషానే 73 పరుగులు చేయగా, స్మిత్ 81 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్ లో  హైలైట్ బ్యాటింగ్ అంటే యువ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ దేనని చెప్పాలి. గ్రీన్ 8 ఫోర్లు , 4 సిక్సులతో 84 పరుగులు చేసి ఆసీస్ ఆధిక్యం మరింత పెరగడానికి కారకుడయ్యాడు.

కెప్టెన్ టిమ్ పైన్ కూడా చివర్లో ధాటిగా ఆడి 6 ఫోర్లతో 39 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో సైనీ 2, అశ్విన్ 2, బుమ్రా 1, సిరాజ్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 338 పరుగులు చేయగా, భారత్ 244 పరుగులు సాధించింది.

More Telugu News