Telangana: తెలంగాణ సీనియర్ నేత మోత్కుపల్లిపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి.. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన నేత!

  • యాదాద్రి జిల్లాలోని మల్లాపురంలో ఘటన
  • దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ నేత భిక్షమయ్యగౌడ్ వర్గీయులు
  • బీఎల్ఎఫ్ టికెట్ పై మోత్కుపల్లి పోటీ

యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ నేత బూడిద భిక్షమయ్యగౌడ్ అనుచరులు రెచ్చిపోయారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న తెలంగాణ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులుపై దాడికి దిగారు. ఈ సమయంలో అక్కడే ఉన్న భిక్షమయ్య గౌడ్ తన అనుచరులను వారించే ప్రయత్నం చేయలేదు. దీంతో తమపై దాడిచేసిన భిక్షమయ్య గౌడ్, ఆయన అనుచరులను అరెస్ట్ చేయాలంటూ మోత్కుపల్లి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. 2009లో ఆలేరు నియోజకవర్గం నుంచి భిక్షమయ్యగౌడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఈ ఘటన జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో ఈ రోజు చోటుచేసుకుంది. డిసెంబర్ 7న జరగనున్న ఎన్నికల్లో ఆలేరులో పోటీ చేసేందుకు మోత్కుపల్లి ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) పార్టీ ఇటీవల విడుదల చేసిన రెండో జాబితాలో మోత్కుపల్లి పేరును చేర్చింది. ఈ నేపథ్యంలో ఆయన ఆలేరులో బీఎల్ఎఫ్ టికెట్ పై పోటీ చేయడం ఖరారైపోయింది. ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ ప్రచారంలో ఎదురుపడటంతో మోత్కుపల్లి వర్గీయులపై భిక్షమయ్యగౌడ్ వర్గీయులు దాడిచేశారు.

More Telugu News