Telugudesam: దుర్గమ్మ గుడిలో లోకేశ్ కోసం తాంత్రిక పూజలు.. అందుకే నివేదికను తొక్కిపెట్టారు!: బీజేపీ నేత ఆరోపణ

  • టీడీపీపై బీజేపీ నేత ఉమామహేశ్వర రావు ఫైర్
  • బీసీలంటే చంద్రబాబుకు నచ్చరని వ్యాఖ్య
  • ఆలయ ఈవోకు మంచి పోస్ట్ ఇచ్చారని విమర్శ

ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేశ్ పై బీజేపీ అధికార ప్రతినిధి ఉమామహేశ్వర రావు తీవ్రంగా మండిపడ్డారు. విజయవాడ కనక దుర్గ గుడిలో లోకేశ్ కోసం టీడీపీ నేతలు అర్ధరాత్రి తాంత్రిక పూజలు నిర్వహించారని ఆరోపించారు. అందువల్లే ఈ ఘటనకు సంబంధించి నివేదికను టీడీపీ నేతలు తొక్కిపెట్టారని విమర్శించారు. ఈ రోజు విజయవాడలో జరిగిన ఓ సమావేశంలో ఉమామహేశ్వర రావు మాట్లాడారు.

చంద్రబాబుకు బీసీలు అంటే నచ్చరనీ, అందువల్లే దుర్గ గుడి పాలకమండలి సభ్యురాలు సూర్యలతను తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తాంత్రిక పూజలు చేయించిన ఆలయ ఈవో సూర్యకుమారికి రాష్ట్ర ప్రభుత్వం మంచి పోస్టింగ్ ఇచ్చి సత్కరించిందని ఎద్దేవా చేశారు.

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు రూ.100 కోట్ల అవినీతికి పాల్పడ్డారని చెబుతున్న నేతలు.. దమ్ముంటే ఈ ఆరోపణలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేయిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News