: పాక్, చైనాలు భారత్ పై దాడికి సిద్ధమవుతున్నాయి: లోక్ సభలో ములాయం సింగ్

పాకిస్థాన్ తో కలసి మన దేశంపై దాడి చేయడానికి చైనా సిద్ధమవుతోందని సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ రక్షణ మంత్రి ములాయం సింగ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభలో జీరో అవర్ లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనాకు దిమ్మతిరిగేలా టిబెట్ విషయంలో భారత్ తన స్టాండ్ ను మార్చుకోవాలని... టిబెట్ స్వాతంత్ర్య పోరాటానికి మద్దతు ప్రకటించాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. చైనాతో ఘర్షణ వాతావరణం నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి సవాళ్లను స్వీకరించే స్థితిలో ఉందో తెలియజేయాలని అడిగారు.

ప్రస్తుతం చైనా నుంచి పెద్ద ప్రమాదాన్ని భారత్ ఎదుర్కొంటోందని... ఇదే విషయం గురించి ప్రభుత్వాన్ని తాను గత కొన్నేళ్లుగా హెచ్చరిస్తూనే ఉన్నానని ములాయం తెలిపారు. ఇప్పుడు పాకిస్థాన్ తో చైనా నేరుగా చేతులు కలిపిందని... భారత్ పై దాడికి పూర్తి స్థాయిలో సన్నద్ధమైందని చెప్పారు. భారత్ ను టార్గెట్ చేసేందుకు పాకిస్థాన్ కు న్యూక్లియర్ ఆయుధాలను కూడా చైనా సమకూర్చిందని చెప్పారు. చైనానే భారత్ కు ప్రధాన శత్రువని, పాకిస్థాన్ కాదని ములాయం అన్నారు. పాకిస్థాన్ మనకు ఎలాంటి హానీ చేయలేదని చెప్పారు.

More Telugu News