: తమిళ నటులు విజయ్‌కుమార్-మంజుల కుమార్తెపై అల్వాల్‌లో కిడ్నాప్ కేసు

ప్రముఖ సినీ నటులు విజయ్‌కుమార్‌-మంజుల దంపతుల కుమార్తె వనితపై హైదరాబాద్‌లోని అల్వాల్‌‌ పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్‌, ఛీటింగ్‌, నిబంధనల అతిక్రమణ కేసులు నమోదయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడుకు చెందిన ఆనంద్‌రాజన్‌ను 2007లో వనిత రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. మనస్పర్థలు రావడంతో 2012లో విడిపోయారు. వీరికి జెనిత అనే కుమార్తె ఉంది. పరస్పర అవగాహన ఒప్పందం ప్రకారం జెనిత తండ్రి వద్ద ఉండేలా తమిళనాడు కోర్టు ఆదేశాలిచ్చింది.

అయితే కుమార్తెను చూడాలనుకున్నప్పుడు మాత్రం తల్లి చూడొచ్చని పేర్కొంది. పాపతో కలిసి ఆనంద్‌రాజన్ అల్వాల్ లో ఉంటున్నారు. ఇప్పుడు జెనితకు ఎనిమిదేళ్లు. ఏప్రిల్‌లో వనిత మరికొందరితో కలిసి ఆనంద్‌రాజన్ ఇంటిపై దాడిచేసి పాపను తీసుకెళ్లింది. కుమార్తె ఆచూకీ కోసం ఎంతగా ప్రయత్నించినా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో ఆనంద్‌రాజన్ అల్వాల్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News