: టీఆర్ఎస్- కాంగ్రెస్ కార్యకర్తల మధ్య రాళ్లదాడి.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి కాలికి స్పల్పంగా గాయాలు.. భారీగా చేరుకున్న పోలీసులు
నల్లగొండ జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన బత్తాయి మార్కెట్ ప్రారంభోత్సవంలో హింస చోటుచేసుకుంది. టీఆర్ఎస్-కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి కూడా అక్కడే ఉన్నారు. ఆయనపై కూడా రాళ్లు విసిరారు. దీంతో ఆయన కాలికి స్పల్పంగా గాయాలయ్యాయి. అక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకున్న పోలీసులు కోమటిరెడ్డిని అక్కడి నుంచి బలవంతంగా బయటకు తరలించారు.
ఈ రోజు మధ్యాహ్నం మార్కెట్ ప్రారంభోత్సవం జరగాల్సి ఉంది. ఈ ప్రారంభోత్సవానికి పెద్ద సంఖ్యలో మంత్రి జగదీశ్ రెడ్డి అనుచరులు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు వచ్చారు. ఈ నేపథ్యంలోనే పరస్పరం గొడవకు దిగారు. ఇరుపార్టీల కార్యకర్తలు రాళ్లు రువ్వుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసం అయ్యాయి. టీఆర్ఎస్ కార్యకర్తలు ‘కోమటిరెడ్డి గో బ్యాక్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు.