: బాహుబలి సుదీర్ఘ ప్రయాణం గురించి రాజమౌళి తనయుడి భావోద్వేగపూరిత లేఖ

ద‌ర్శ‌కధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ రాసిన ఓ లెటర్ ప్రేక్షకులను ఎమోషనల్‌గా క‌దిలిస్తోంది. బాహుబ‌లి రెండు పార్ట్‌ల కోసం ఐదేళ్లకు పైగా క‌ష్ట‌ప‌డ్డ రాజ‌మౌళి చివ‌రకు ఆ సినిమా పార్ట్‌-2 విడుద‌ల‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతాలో కార్తికేయ ఆ లేఖ రాసి పెట్టాడు. బాహుబలి కోసం తన తండ్రి 100 శాతం పర్ఫెక్షన్ కోరుకున్నారని ఆయ‌న అన్నాడు. దాని కోసం బాహుబలి టీం శ్రమించి పర్ఫెక్షన్ సాధించింద‌ని చెప్పాడు. ఈ ప్రయాణంలో తాను ఎంతో నేర్చుకున్నానని అన్నాడు. ఈ సినిమా ప్రారంభమయ్యే నాటికి త‌న‌ వయసు 19 ఏళ్లని చెప్పాడు. ఈ ప్ర‌యాణాన్ని తన జీవితాంతం గుర్తుంచుకుంటాన‌ని అన్నాడు.

ఈ సినిమా ప్రాజెక్ట్‌లో పనిచేసిన ప్రతి వ్యక్తినుండి తాను ఎంతో కొంత నేర్చుకుంటూనే ఉన్నానని కార్తికేయ చెప్పాడు. తన పిన్ని వల్లి ఈ ప్రాజెక్ట్‌కు తల్లి అని, ఆమె బాహుబ‌లి టీమ్ అందర్నీ సొంత బిడ్డల్లా చూసుకున్నారని అన్నాడు. ఈ చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ గురించి ఆయ‌న రాస్తూ.. కష్టం వస్తే కుంగిపోయే స్వభావం ఆయ‌నది కాదని అన్నాడు. బాహుబలి-1 కు మొదట్లో నెగిటివ్ టాక్ వచ్చినప్ప‌టికీ శోభు యార్ల‌గ‌డ్డ బాధ‌ప‌డిపోలేద‌ని, ఈ సినిమాని ఎలా ప్రమోట్ చేయాలన్న దానిపైనే దృష్టిపెట్టార‌ని అన్నాడు. వీఆర్, కామిక్స్ , నావల్స్ ఇలా ప్రమోషన్‌లో కొత్త ట్రిక్స్‌తో మూవీపై ఉన్న మిశ్ర‌మ స్పంద‌న‌ను మార్చేసి మంచి స్పంద‌న వ‌చ్చేలా చేశార‌ని అన్నాడు.


More Telugu News