: కుల్ భూష‌ణ్‌ వ‌ద్ద భార‌త పాస్‌పోర్టు ఉంది.. గూఢ‌చారి ఎలా అవుతాడు?: రాజ్యసభలో రాజ్‌నాథ్ సింగ్

గూఢ‌చ‌ర్యానికి పాల్ప‌డ్డాడ‌ని ఆరోపిస్తూ భారతీయ నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్‌ జాధవ్‌కు పాకిస్థాన్‌ ఆర్మీ కోర్టు ఉరిశిక్ష విధించిన అంశంపై ఈ రోజు రాజ్య‌స‌భ దద్ద‌రిల్లింది. ఈ అంశంపై ఏ చ‌ర్య‌లు తీసుకుంటున్నారో చెప్పాల‌ని విప‌క్ష స‌భ్యులు ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. ఈ అంశంపై రాజ్య‌స‌భ‌లో మాట్లాడిన హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. భారత ప్రభుత్వం ఈ విష‌యంలో కుల్ ‌భూష‌ణ్‌కు న్యాయం జ‌రిగేలా చూసేందుకు అన్ని ప్రయత్నాలు జరుపుతుందని అన్నారు.

ఆయ‌న‌ను పాక్‌ మార్చి 2016లో అరెస్టు చేసిందని చెప్పారు. ఆయ‌న‌ గూఢచ‌ర్య‌ కార్యకలాపాలు చేయలేదని, ఆయ‌న వ్యాపార నిమిత్తం ఇరాన్ వెళ్లారని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. గూఢ‌చర్యం ఆరోప‌ణ‌లపై ఆయ‌న‌ను ఎలా అరెస్టు చేస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. కుల్ ‌భూష‌ణ్‌ వ‌ద్ద భార‌త పాస్‌పోర్టు ఉందని, అటువంటప్పుడు గూఢ‌చారి ఎలా అవుతాడని అన్నారు. ఈ విష‌యంపై ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు తీసుకుంటూ ముందుకు వెళుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

More Telugu News