: ఎంపిక చేసిన మహిళలతో కేసీఆర్‌ ఫోన్‌లో మాట్లాడి ప‌త్రిక‌ల్లో ప్రచారం చేసుకున్నారు: ఎల్‌.ర‌మ‌ణ‌

తెలంగాణ‌లో రెండు పడకగదుల ఇళ్లకు సంబంధించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం త‌ప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని టీటీడీపీ అధ్య‌క్షుడు ఎల్‌.ర‌మ‌ణ ఆరోపించారు. డబుల్ బెడ్ రూంల విష‌య‌మై అభిప్రాయం తెలుసుకుంటున్నానంటూ ఎంపిక చేసిన మహిళలతో ఫోన్‌లో మాట్లాడి ప్రచారం చేసుకుని పత్రికల్లో రాయించుకోవడం కేసీఆర్‌కే చెల్లిందని ఆయ‌న విమ‌ర్శించారు. ఇటువంటి మ్యాజిక్‌లు చేసి కేసీఆర్ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆయ‌న అన్నారు.
 
మరోవైపు రైతుల సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ వ‌చ్చే నెల 3న అన్ని జిల్లాల క‌లెక్ట‌రేట్ల ముట్ట‌డికి టీటీడీపీ పిలుపునిచ్చింది. రైతుల సమస్యలపై హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఈ రోజు టీడీపీ నేతలు రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డితో పాటు ప‌లువురు స‌మావేశ‌మై చ‌ర్చ‌లు జ‌రిపారు. రాష్ట్రంలోని వరంగల్‌, ఖమ్మం జిల్లాల‌తో పాటు హైద‌రాబాద్‌లోని మ‌ల‌క్‌పేట్ వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి రైతుల స‌మ‌స్య‌ల‌పై వారు చ‌ర్చించారు. వారి ప‌రిస్థితి ఎంతో దుర్భరంగా ఉన్నా రాష్ట్ర సర్కారు మాత్రం వాటిని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఎల్‌.ర‌మ‌ణ అన్నారు. మిర్చి పంటలకు గిట్టుబాటు ధరలేకపోవ‌డంతో రైతులు పంటను కాల్చి వేస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. రైతులు ఇన్ని స‌మ‌స్య‌లు ప‌డుతున్నప్ప‌టికీ సీఎం కేసీఆర్ స్పందించ‌డం లేద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.

More Telugu News